వామపక్షాల విద్యుత్ పోరు: ఏప్రిల్ 9న రాష్ట్ర బంద్
హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనకు నిరసనగా వామపక్షాలు తమ ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. పది వామపక్షాలు బుధవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 9వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. దానికి ముందు ఏప్రిల్ 1వ తేదీన జిల్లా, మండల కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని వామపక్షాలు నిర్ణయించాయి.
వామపక్షాల దీక్షను భగ్నం చేయడం దుర్మార్గమైన చర్య అని వామపక్షాల ప్రతినిధి గుర్రం విజయ్ కుమార్ అన్నారు. ధరల పెంపు ప్రతిపాదనను సమీక్షిస్తున్న ఈఆర్సీపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని ఆయన విమర్సించారు. వాణిజ్య విద్యుత్ విధానం, ఎఫ్ఎన్ఎను ఉపసంహరించుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. వామపక్షాలు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద వామపక్షాల నేతలు చేపట్టిన నిరాహారదీక్షను పోలీసులు మంగళవారం రాత్రి భగ్నం చేశారు.
కాగా, తమ విద్యుత్తు పోరులో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని వెళ్లాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి. మతతత్వ పార్టీలతో కొన్ని పార్టీలను దూరం పెట్టకూడదని కూడా వామపక్షాలు నిర్ణయించుకున్నాయి. అంటే, బిజెపి, మజ్లీస్ పార్టీలను కూడా తమతో కలుపుకుని వెళ్లాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి.

ఇదిలా వుంటే, విద్యుత్ సమస్యపై పాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ శానససభ్యులకు వామపక్షాల నేతలు సంఘీభావం ప్రకటించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్సి బివి రాఘవులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు తెలిపారు. దీక్ష చేస్తున్న టిడిపి నాయకులకు కింగ్ కోఠీ ఆస్పత్రి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. విద్యుత్ సమస్యపై ఎవరు ఆందోళన చేసినా మద్దతు తెలపాలని వామపక్షాలు నిర్ణయించాయి.












Click it and Unblock the Notifications