చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నారా లోకేష్, బ్రాహ్మిణి ఆరా
వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా లోకేష్, బ్రాహ్మిణిలు వచ్చి ఆయనను కలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆయనను, పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ పలువురు నేతలతో కాసేపు ముచ్చటించారు.
కాగా, విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం రోజు ఒకరోజు నిరసన దీక్షకు దిగనున్నారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.
ఛార్జీలపై తగ్గకుంటే ఉద్యమం
విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాదులో అన్నారు. ఛార్జీల పెంపుతో సామాన్యులపై అధికభారం పడుతుందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకోని పక్షంలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు తాము తమ పోరాడాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
బుద్ధి చెప్పాలి: నామా
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు ఖమ్మం జిల్లాలో అన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ కూసుమంచిలో పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నామా రైతులు పేదవర్గాలపై కనికరం లేకుండా అదనపు భారాన్ని మోపిందన్నారు.