బిజెపిలో సీనియర్లకు షాక్: ఎవరీ మురళీధర్ రావు?
హైదరాబాద్: బిజెపిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ నేతలకు షాక్ తగిలింది. అనూహ్యంగా బిజెపి అఖిల భారత కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన 48 ఏళ్ల మురళీధర్ రావు పేరు తెర మీదికి వచ్చింది. రాష్ట్రం నుంచి ఇంత ప్రాధాన్యం పొందిన నాయకుల్లో మురళీధర రావు రెండో వ్యక్తి. అంతకు ముందు ముప్పవరపు వెంకయ్యనాయుడికి మాత్రమే ఈ గౌరవం దక్కింది.
తొలుత ఎబివిపిలో ఆ తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో మురళీధరరావు పనిచేశారు. ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన స్వగ్రామం జమ్మికుంటకు సమీపంలోని కోరపల్లి. వరంగల్లో డిగ్రీ వరకు చదువుకున్నారు. అనంతరం హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్ చేశారు.
నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న కాలంలో వరంగల్లో ఎబివిపి విద్యార్థి సంఘంలో చురుగ్గా పాల్గొన్నారు. 1984లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1986లో ఆయనపై ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్లో హత్యాయత్నం జరిగింది. అనంతరం ఆయన రాజస్థాన్ ఎబివిపి ప్రచార కార్యక్రమంలో పనిచేశారు. 1991లో జమ్ముకాశ్మీర్లో పనిచేశారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖులైన ఎస్ గురుమూర్తితోపాటు సోషలిస్టు నేతలు జార్జిఫెర్నాండెజ్, చంద్రశేఖర్లాంటి దిగ్గజాలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
2009లో బిజెపిలో చేరిన మురళీధర్రావు బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొన్నారు. 2010లో ఆయన పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2011లో అద్వానీ చేపట్టిన జన చేతన యాత్రకు ఆయన కో కన్వీనర్గా వ్యవహరించారు.
పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి సిహెచ్. విద్యాసాగర రావు, నల్లు ఇంద్రసేనా రెడ్డిని తప్పించారు. డాక్టర్ కె. లక్ష్మణ్ను కార్యదర్సి పదవి నుంచి తప్పించి కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. కరీంనగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిహెచ్. విద్యాసాగరరావు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు పోటీ మురళీధర్ రావు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిణామాలపై మాట్లాడడానికి విద్యాసాగర రావు సముఖంగా లేరని తెలుస్తోంది. అయితే మురళీధర రావు రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై దృష్టి సారిస్తారని, కరీంనగర్ లోకసభ స్థానం విద్యాసాగర రావును దాటి పోదని కూడా అంటున్నారు.
రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు కొత్తగా ఏర్పడిన క్రమశిక్షణా సంఘంలో సభ్యుడిగా స్థానం పొందారు. జాతీయ కార్యవర్గంలో బండారు దత్తాత్రేయ శాశ్వత ఆహ్వానితుడు కాగా, సోము వీర రాజుకు ప్రత్యేకాహ్వానితుడిగా స్థానం దక్కింది.