వేధింపులే: జయప్రద, జగన్ పార్టీ రాజమండ్రి టిక్కెట్!
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన వేధింపులను ప్రజలు అందరూ గమనిస్తున్నారని ఆమె చెప్పారు. తాను వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రానికి వస్తానని చెప్పారు. తూర్పు గోదావరి రాజమండ్రి పార్లమెంటు స్థానం నుండి తాను పోటీ చేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.
ఉత్తర ప్రదేశ్లో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదన్నారు. పార్లమెంటు సభ్యులకు కూడా అక్కడ ఏమాత్రం రక్షణ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలుగు సినిమాలలో నటిస్తానని చెప్పారు. మహిళా బిల్లుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాధీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే ములాయం, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు అడ్డుకుంటున్నారన్నారు. కాగా, నిన్న ఆమె మాట్లాడుతూ సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి నేత కావాలని అభిప్రాయపడ్డారు.
సస్యశ్యామలమైన ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేసి అందరిలోను చిరస్థాయిగా నిలిచిన వైయస్ లాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. చాలా రాజకీయ పార్టీల నుండి తనకు ఆహ్వానం ఉన్నా నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే పార్టీలో చేరుతానని చెప్పారు.
వైయస్కు కితాబివ్వడం, జగన్పై వేధింపులనడం అదే సమయంలో రాజమండ్రి నుండే బరిలోకి దిగుతానని చెప్పడం ద్వారా ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.