జయసుధ చేతిలో..: తలసానిపై కొప్పుల, యాష్కీపై గౌడ్
2004లో తమ పార్టీకి చెందిన నేత పద్మారావు చేతిలో కూడా తలసాని దారుణంగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. తలసానికి కెసిఆర్ స్థాయికి సరిపోరన్నారు. కెసిఆర్ లాంటి వారు గురించి మాట్లాడే స్థాయి ఆయనకు ఏమాత్రం లేదన్నారు. కెసిఆర్ను సికింద్రాబాదులో పోటీ చేయమని సవాల్ చేస్తున్న తలసాని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును సిద్దిపేట నుండి పోటీ చేయించగలరా అని ప్రతి సవాల్ చేశారు.
మధుయాష్కీపై స్వామి గౌడ్
పదకొండేళ్ల తెలంగాణ ఉద్యమంలో పదకొండు రోజులు కూడా పాల్గొనని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ గౌడ్ మాటలకు విలువ ఉంటుందా? అని శాసనమండలి సభ్యుడు స్వామి గౌడ్ మండిపడ్డారు. తెరాసకు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావుకు సంబంధాలు ఉన్నాయన్న వ్యాఖ్యలపై స్వామి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాష్కీది పేపర్ యుద్ధమే అన్నారు. తోటి ఎంపీలతో ఉద్యమాన్ని వెనక్కి లాగించిన ఘనత ఆయనదే అన్నారు.
ఆలంపూర్ కోర్టుకు కోదండరాం
సడక్ బంద్ కేసులో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్, తెరాస నేతలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణా రావు, జితేందర్ రెడ్డిలు ఆలంపూర్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఛార్జీషీటు ఇంకా దాఖలు కాలేదని, ఛార్జీషీటు దాఖలు చేసిన తర్వాత మరోసారి న్యాయస్థానం ముందు హాజరు కావాలని వారికి కోర్టు ఆదేశించింది.
రిమాండు గడువు ముగియడంతో వారు న్యాయస్థానానికి హాజరయ్యారు. కోర్టు ఆదేశాల తర్వాత బయట కోదండరామ్ విలేకరులతో మాట్లాడారు. ఇది గుడ్డి ప్రభుత్వమని, శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న తమను కోర్టులు, జైళ్ల చుట్టు తిప్పుతున్నారని మండిపడ్డారు. మరో సడక్ బందు పైన రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. వారు జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.