పోల్: జూనియర్ ఎన్టీఆర్ దూరమైతే టిడిపికి నష్టమే
హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ దూరమైతే తెలుగుదేశం పార్టీకి నష్టమేనని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం వన్ ఇండియా తెలుగు నిర్వహించిన ఆన్లైన్ పోల్లో తేలింది. జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెడితే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందా అని వేసిన ప్రశ్నకు అవునని ఎక్కువ మంది సమాధానం ఇచ్చారు. ఈ సర్వేలో 14,659 మంది పాల్గొన్నారు. వీరిలో 9,030 మంది అంటే 61.6 శాతం మంది జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెడితే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
కాగా, 5,316 మంది, అంటే 36.3 శాతం మంది తెలుగుదేశం పార్టీకి నష్టం జరగదని అభిప్రాయపడ్డారు. 313 మంది అంటే 2.1 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈ లెక్కన చూస్తే జూనియర్ ఎన్టీఆర్ దూరమైతే తెలుగుదేశం పార్టీకి ఏదో మేరకు నష్టం జరుగుతుందనేది మాత్రం అర్థమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలి విజయవాడ పర్యటన సందర్భంగా ఆయనకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు, హీరో నందమూరి బాలకృష్ణ పార్టీ నాయకులకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ను పార్టీకి దూరంగా ఉంచాలని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ నిర్ణయించుకున్నట్లు విశ్లేషణలు వచ్చాయి.
ఆ పరిస్థితిలో వన్ ఇండియా తెలుగు జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెడితే తెలుగుదేశం పార్టీకి నష్టమా అనే ప్రశ్న ఇచ్చింది. అయితే, ఈ పోల్ సర్వేకు పరిమితులు ఉన్నాయనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. వన్ ఇండియా తెలుగుకు విశేషమైన పాఠకులు ఉన్నారనే విషయాన్ని గుర్తిస్తూనే ఆన్లైన్ పోల్కు సంబంధించిన పరిమితులను గమనించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ రాష్ట్రంలో నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితమవుతుంది. ఈ పోల్ సర్వేలో గ్రామీణ ప్రాంత ప్రజలు పాల్గొనే అవకాశం లేదు. అయితే, మధ్య తరగతి చదువుకున్నవారి అభిప్రాయం మాత్రం ఈ పోల్ సర్వేలో వెల్లడవుతుందనేది గుర్తించాల్సి ఉంటుంది.