తగ్గని ఫ్లెక్సీలు: వైయస్ జగన్ పక్కనే జూనియర్ ఎన్టీఆర్
గురువారం తిరువూరులోని వెంకటేశ్వర థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా ప్లెక్సీపై వైయస్సార్ కాంగ్రెసు కన్వీనర్ వల్లభాయ్, కొడాలి నానితో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రాలు కూడా ముద్రించి ఉండటంపై దుమారం రేగింది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీని తొలగించారు.
ఇప్పటివరకు వివాదాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో కొందరు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేయడం శోచనీయమని స్థానికులు అంటున్నారు. ఇక ఖమ్మంలో డిప్యూటీ స్పీకర్ భట్టి, జూనియర్ ఎన్టీఆర్తో ఉన్న ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి.
ఖమ్మం జిల్లా ఇల్లెందు క్రాస్రోడ్డు, బస్టాండ్ సెంటర్, వైరా రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. బాద్షా చిత్రం విడుదల సందర్భంగా చీరాల మోహన్ థియేటర్ వద్దా ఇటువంటి ఫ్లెక్సీనే ఏర్పాటు చేశారు. చీరాలకు చెందిన వైఎస్ జగన్ యూత్ ఏర్పాటు చేసినట్టుగా ఫ్లెక్సీలో ఉంది. అయితే థియేటర్ నిర్వాహకులు ముందు జాగ్రత్తగా రాత్రికి రాత్రే దానిని తొలగించేశారు.