రెండు కుటుంబాలే: వైయస్, కెసిఆర్లపై మోత్కుపల్లి
జగన్ రాష్ట్రాన్ని దోచి లక్ష కోట్లు సంపాదిస్తే కెసిఆర్ పేద ప్రజల శవాలపై పేలాలు ఏరుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణే లక్ష్యమన్న కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ వద్దు సీట్లు కావాలని అంటున్నారని విమర్శించారు. కెసిఆర్ తన సొంత ప్రయోజనాల కోసమే తెలంగాణ సెంటిమెంటును వాడుకుంటున్నారన్నారు. పది ఎంపీ స్థానాలలో పోటీ చేసి కుటుంబంతో సహా పార్లమెంటుకు వెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణపై తేల్చాల్సింది కేంద్రమే అన్నారు. తెలంగాణ గురించి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే తనకు పడుతుందని కెసిఆర్కు తెలుసునన్నారు. అందుకే ఆయన ఢిల్లీలో గళమెత్తడం లేదన్నారు. రాజకీయ అధికారాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వంద అసెంబ్లీ, పది పార్లమెంటు స్థానాలు తెరాసకు వచ్చే వరకు ఆయన తెలంగాణ గురించి మాట్లాడరా అని ప్రశ్నించారు.
సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు... కోమటిరెడ్డి
తమపై విమర్శలు చేసే వారికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుక్రవారం నల్గొండలో అన్నారు. కోమటిరెడ్డి సోదరుల గురించి జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. తమకు సత్తా ఉంది కాబట్టే తమపై విమర్శలు చేస్తున్నార్నారు. విమర్శలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత తెలంగాణపై కేంద్రం నుండి ఓ ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. లేకపోతే ప్రజల కోరిక మేరకు భవిష్యత్తును నిర్ణయించుకుంటామని చెప్పారు.