ఎన్టీఆర్కు బాలకృష్ట వార్నింగ్: జగన్ పార్టీపై ఫైర్

జూనియర్ ఎన్టీఆర్తో ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసేవారికి వయస్సుతో నిమిత్తం లేకుండా పార్టీ గౌరవాన్ని ఇస్తుందని, పార్టీ కార్యకర్తలతో మమేకమై ప్రజల కష్టాల్లో పాలుపంచుకునే నాయకులకు గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ పర్యటనకు హాజరు కావద్దని తాను పార్టీ నాయకులతో చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమం మీద రాలేదని, ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాడని ఆయన అన్నారు. తాను జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ఏ పార్టీలో ఉన్నాడో జూనియర్ ఎన్టీఆరే చెప్పాలని ఆయన అన్నారు.
తమ తండ్రి ఎన్టీ రామారావు ఫొటోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఫ్లెక్సీల్లో వాడుకోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మకు ఓట్లు రాలవని భావించి, ఎన్టీ రామారావుకు బొమ్మకు ఓట్లు రాలుతాయని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు అనుకుంటున్నారని, అందుకే ఎన్టీ రామారావు బొమ్మను వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ బొమ్మను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకోవడం సరి కాదని, చట్టబద్ధం కూడా కాదని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు ఓ పార్టీ వ్యవస్థాపకుడని, అందువల్ల అలా వాడుకోవడం తగదని ఆయన అన్నారు. కృష్ణుడి ఫొటో అనుకోండి అది ఎవరైనా వాడుకోవచ్చు గానీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు ఫొటోను మరో పార్టీ వాడుకోవడం సరి కాదని ఆయన అన్నారు.
పార్టీలో నాయకత్వంపై ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. ఎన్టీ రామారావు బొమ్మను తొలగించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అడుగుతానని ఆయన చెప్పారు. పార్టీలో తాను త్వరలో క్రియాశీలక బాధ్యతలు తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీలో చేరడానికి జయప్రద తనను సంప్రదిస్తే విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు.
విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. తొలి సంతకం ఆయన చేశారు. తన తల్లిగారి ఊరైన కొమరోలులో ఆ విధమైన సంతకం చేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. పార్టీ చేపట్టే ఉద్యమాల్లో తాను ముందు ఉంటానని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజలను పీడిస్తోందని ఆయన విమర్శించారు.
అధికారంలో కాంగ్రెసు.. అంధకారంలో ఆంధ్రప్రదేశ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్తు ఎవరికి వర్తిస్తుందని ఆయన చెప్పారు. సర్ చార్జీల విధింపునకు శ్రీకారం చుట్టింది వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డి విధానాల వల్లనే కరెంట్ సంక్షోభం నెలకొందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పాలన అవినీతమయమని ఆయన అన్నారు. రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications