ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు భువనేశ్వరి: లోకేష్ యాక్టివ్
విద్యుత్తు చార్జీల పెంపును నిరసిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఆమె తొలి సంతకం చేశారు. సంతకాల సేకరణను ఈ నెల 9వ తేదీన ముగించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే, ప్రజాస్పందనను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని రోజులు పొడగించాలని పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. కాగా, భువనేశ్వరి సోదరుడు, హీరో బాలకృష్ణ కృష్ణా జిల్లా కొమరోలులో పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదిలావుంటే, నారా లోకేష్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. పార్టీ పరిస్థితిపై ఆయన వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. తనకు సన్నిహితులైన కొంత మంది పత్రికా రచయితల నుంచి కూడా ఆయన సమాచారం సేకరిస్తున్నారు. దీంతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలను రూపొందిస్తున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీన విశాఖపట్నం జిల్లాలో తన పాదయాత్రను ముగిస్తారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు నారా లోకేష్ హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం ఎలా ఉన్నా పాదయాత్ర ముగించుకుని చంద్రబాబు హైదరాబాదు వచ్చిన తర్వాత రాష్ట్ర పర్యటన చేపట్టాలని నారా లోకేష్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు హైదరాబాదు వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తారని అంటున్నారు. ఈ సందర్భంగా తండ్రికి చేదోడువాదోడుగా ఉండాల్సి వస్తుందేమోనని నారా లోకేష్ అనుకుంటున్నట్లు సమాచారం. అలా ఉండాల్సి వస్తే తన పర్యటన ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. మేలో జరిగే పార్టీ మహానాడులో నారా లోకేష్కు, బాలయ్యకు పార్టీ పదవులు ఇస్తారని అంటున్నారు.
నారా లోకేష్కు తెలుగు యువత పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలుగు యువత అధ్యక్షుడిగా జూన్లో రాష్ట్ర పర్యటన చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఆయన చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద, జూనియర్ ఎన్టీఆర్ను, హరికృష్ణను పక్కన పెట్టి చంద్రబాబుకు బాలకృష్ణ, భువనేశ్వరి, లోకేష్ పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.