తెలంగాణ డిమాండ్ న్యాయమైంది కాదు: కట్జూ వ్యాఖ్య
తెలంగాణ న్యాయమైన డిమాండ్ కాదని, కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్ని ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని, ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుందని అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిమాండ్లే వినిపిస్తాయని, ఇలాంటి పరిస్థితులు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు.
తెలంగాణలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని కట్జూ అభిప్రాయపడ్డారు. ఆర్థిక అసమానతలు తగ్గాయని చెప్పారు. తాను ఇంతవరకు ఓటు హక్కు వినియోగించుకోలేదని తెలిపారు. పార్లమెంట్ సభ్యుల్లో మూడో వంతు మంది నేర చరితులేనని, దేశ ప్రజలు కూడా కులాలవారీగా చీలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ను భారత్లో కలపాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రమాణాలు పడిపోతున్నాయి
దక్షిణాది రాష్ట్రాల్లోని మీడియా సంస్థలకు సంబంధించిన పిటిషన్లను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) శుక్రవారం హైదరాబాద్లో విచారించింది. పాత్రికేయులు ఏ రంగాలకు సంబంధించి వార్తలను సేకరిస్తారో, ఆయా రంగాల్లో వారికి ముందస్తు శిక్షణ ఇవ్వాలని జస్టిస్ కట్జూ అభిప్రాయపడ్డారు. వార్తలు రాసేసిన తర్వాత సంబంధం లేనట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. సంచలన వార్తల వల్ల సమాజానికి ప్రయోజనం ఉండదని, కండబలంతో కాకుండా బుద్ధి బలంతో పనిచేయాలని సూచించారు. వార్తలు ప్రచురించే ముందు వివరణలు తీసుకోరా? సర్క్యులేషన్, టీఆర్పీ రేటింగ్ల కోసం ఇష్టమొచ్చినట్లుగా వార్తలు రాస్తారా? అని ఆయన మీడియాను ప్రశ్నించారు.
జర్నలిజంలో విలువలు దిగజారుతున్నాయని, పాత్రికేయులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని, వేతనాలు కూడా తక్కువగా ఉన్నాయని అన్నారు. వైద్యులు, న్యాయవాదుల మాదిరిగా పాత్రికేయులకు కూడా తగిన అర్హతలు ఉండాలని స్పష్టం చేశారు. పాత్రికేయులకు సంబంధించిన అర్హతలు తదితర అంశాలపై సిఫారసులు చేయడానికి పీసీఐ సభ్యుడు శ్రవణ్ గార్గ్ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటైందని తెలిపారు. ఈ కమిటీ నివేదికను పార్లమెంటులో చర్చించిన తరువాత చట్టం చేయడంపై ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. జర్నలిజం సంస్థల ప్రమాణాలను కూడా గార్గ్ కమిటీ పరిశీలిస్తుందని, వాటిపై ప్రస్తుతం ఎలాంటి నియంత్రణ లేదని జస్టిస్ కట్జూ అన్నారు.