కిరణ్ రెడ్డికి విజయమ్మ సవాల్: తీవ్ర అస్వస్థత

ప్రతిపక్షాల కన్నీరు వరదలై పారుతోందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆమె అన్నారు. ప్రజల కన్నీటి వరదలో ఇటువంటి ముఖ్యమంత్రులు కొట్టుకుపోతారని ఆమె వ్యాఖ్యానించారు. కరెంట్ సమస్యపై రెఫరెండానికి ముఖ్యమంత్రి సిద్ధపడాలని ఆమె సవాల్ చేశారు. ప్రజల కోసమే తాము దీక్ష చేస్తున్నామని ఆమె చెప్పారు.
తమ దీక్షను ముఖ్యమంత్రి ఎగతాళి చేస్తున్నారని, ఆమె అన్నారు. కరెంట్ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్దామని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలుతుందని ఆమె అన్నారు. ఇప్పుడంతా బాగుందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని ఆమె అడిగారు. పల్లెలకు వెళ్తే ప్రజల కరెంట్ కష్టాలు ముఖ్యమంత్రికి తెలుస్తాయని ఆమె అన్నారు. ప్రజా బ్యాలెట్కు మంచి స్పందన లభిస్తోందని ఆమె చెప్పారు. ఈ నెల 9వ తేదీన జరిగే బంద్ను విజయవంతం చేయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. దీక్ష విరమించే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు.
గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న వైయస్ విజయమ్మ శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పార్టీ శాసనసభ్యులు సుచరిత, గుర్నాథ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నారు. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో శోభా నాగిరెడ్డి, సుజయ కృష్ణా రంగారావు కుప్పకూలారు. గొట్టిపాటి రవికుమార్, జోగి రమేష్, బాలినేని శ్రీనివాస రెడ్డి, అమర్నాథ్ రెడ్డిల బిపి లెవెల్ పడిపోయింది. దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నీరసించిపోయారు. ఆరోగ్యం క్షీణించడంతో శానససభ్యురాలు వనితను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications