తగ్గని జగన్ పార్టీ!: బందరులో మరొక ఫ్లెక్సీ వివాదం
అందులో స్వర్గీయ నందమూరి తారక రామారావు, హీరో జూనియర్ ఎన్టీఆర్, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని, మచిలీపట్ం ఎమ్మెల్యే పేర్ని నానిలతో కూడిన ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిని స్థానిక జగన్ పార్టీ నేత రాంప్రసాద్ ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. బాద్ షాను టచ్ చేస్తే సౌండ్ సాలిడ్గా ఉంటుందని ఈ ఫ్లెక్సీలో రాశారు. ఇది తెలుగుదేశం పార్టీని ఉద్దేశించే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాగా, ఇటీవల గత వారం రోజులుగా కృష్ణా జిల్లాలో ఫ్లెక్సీ రాజకీయాలు వేడెక్కుతున్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల ఫ్లెక్సీలలో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు హీరో జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ల ఫోటోలు కూడా దర్శనమిస్తున్నాయి. ఇవి జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టవద్దంటూ తెలుగుదేశం పార్టీ ఎంతగా డిమాండ్ చేసినా ఫ్లెక్సీ రాజకీయాలు తగ్గడం లేదు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు మాత్రం తమకు దీంతో సంబంధం లేదని, అయితే, ఎన్టీఆర్కు చాలా మంది అభిమానులు ఉంటారని, వారు పెట్టుకునే ఫోటోలు వారి వ్యక్తిగతం అని చెప్పారు.