రోజుకో పార్టీ: జయప్రదకు బాలయ్య చురక, కలిస్తే చూస్తా
తన బొమ్మలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీల ఏర్పాటును జూనియర్ ఎన్టీఆరే ఖండించాలని, లేకపోతే పరిణామాలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు. ఖండించకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని, ఫ్లెక్సీల వివాదాన్ని తేల్చాల్సింది జూనియర్ ఎన్టీఆరేనని ఆయన అన్నారు. అలాగే, జూనియర్ అనుచరుడైన కొడాలి నాని పార్టీని వీడడాన్ని లైట్గా తీసుకున్నారు. ఈ విషయంలో గుడివాడ తెలుగుదేశం పార్టీ కేడరంతా సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి తనను పోటీ చేయమంటున్నారని, అధిష్ఠానం నిర్ణయం మేరకే పోటీ పోటీ చేస్తానని చెప్పారు. గుడివాడ నుంచి పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు బాలకృష్ణ పక్కనే ఉన్న రావి వెంకటేశ్వర రావు స్పందిస్తూ ఆయన గుడివాడ నుంచి పోటీ చేస్తే సంతోషంగా ఆహ్వానిస్తామన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై బాలయ్య నిప్పులు చెరిగారు. కరెంట్ చార్జీల పెంపుపై టిడిపి నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తాను తన తల్లి స్వగ్రామం కొమరవోలులో ప్రారంభించడం ఆనందంగా ఉందని బాలకృష్ణ చెప్పారు. సంతకాల సేకరణ పత్రాలపై బాలకృష్ణ తొలి సంతకం చేసి దేవినేని ఉమాకు అందించారు. చార్జీలు, సర్చార్జీల పేరిట ప్రభుత్వం ప్రజలను వేధిస్తోందని, ముందస్తు ప్రణాళికలు లేకనే కరెంటు భారం వేస్తోందని విమర్శించారు.
టిడిపి హయాంలో పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి సమస్య లేకుండా చేశామని, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రాన్ని అంధకారంలో ముంచిందని ధ్వజమెత్తారు. 50 యూనిట్లలోపు బిల్లు కట్టక్కర్లేదని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించడం హాస్యాస్పదమన్నారు.