తహసీల్దార్పై జగన్ ఎమ్మెల్యే ఫైర్: రంగారెడ్డిలో రచ్చరచ్చ
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తొలి నుండి అండగా ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి జగన్కు చెందిన సాక్షి పత్రికపై గతంలో మండిపడ్డట్లుగా కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మేకపాటి సోదరులు(మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి) దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులు. ఆయన తర్వాత వారు జగన్కు అండగా నిలిచారు. అలాంటి మేకపాటి సోదరులలో ఒకరైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా ఉంటుందని అందరూ భావించే సాక్షి పైన మండిపడ్డారట.
నెల రోజుల క్రితం నెల్లూరులో ఇదే హాట్ టాపిక్గా మారిందన్నారు. నెల్లూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సాక్షి పేపరే నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారట. తమకు చెందిన వార్తలు చిన్నవిగా ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. సాక్షిలో ఉండే వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాళ్లు కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట.
ఇక్కడి సాక్షి ప్రతినిధి పైన తాము హైదరాబాదు కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే చెప్పడమే మానేశానని చెప్పారని చెబుతున్నారు. సాక్షి తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అయినా తమకు జనాలపై నమ్మకముందని మేకపాటి చంద్రశేఖర రెడ్డి చెప్పారు. తాజాగా తహసీల్దారుపై మండిపడ్డారు.
పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన కార్యకర్తలు
హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కార్యకర్తలు సోమవారం ముట్టడించారు. మూడేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న వారికి కాదని మరో వ్యక్తిని కో ఆర్డినేటర్గా నియమించడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు లేదని మండిపడ్డారు. జెండా మోసిన వారికి, ప్రధానంగా బిసిలకు న్యాయం జరగడం లేదని వారు ఆరోపించారు. తమ నేతకు న్యాయం జరిగే వరకు తాము పార్టీ కార్యాలయం ముందే కూర్చుంటామని వారు చెబుతున్నారు.