అదిరిపోయే శుభవార్త.. కాజీపేటలో వచ్చే ఐదేళ్ళలో 200 ఇంటర్ సిటీ రైళ్ళ తయారీ!
కాజీపేటలో రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ త్వరలో పూర్తి కావడంతో ఇక్కడ 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ యూనిట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి ముఖ్యమైన బాధ్యత అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో కాజీపేట యూనిట్ సుమారు 200 ఇంటర్సిటీ రైళ్ల తయారీ
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమీక్ష సమావేశం నిర్వహించి, రానున్న ఐదేళ్లలో కాజీపేట యూనిట్ సుమారు 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ తయారయ్యే ప్రతి రైలు 20 కోచ్లతో తయారవుతుంది. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సిస్టమ్, మెరుగైన వెంటిలేషన్, సురక్షిత కోచ్ డిజైన్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి.

ప్రధాని మోదీకి, రైల్వే మంత్రికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు
ఇక ఈ నిర్ణయంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ మరియు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ రైళ్లు సాధారణంగా 300 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాల్లో నడుస్తాయని, అనేక స్టాప్ లతో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచి రూపొందించారని తెలిపారు.
కాజీపేట యూనిట్ పూర్తి కావటంతో తెలంగాణా రైల్వే కు ఊతం
ఈ ఇంటర్సిటీ రైళ్లు పట్టణాలు-నగరాల మధ్య ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, ఆరోగ్య సేవల కోసం వెళ్లే సామాన్యులకు ప్రయోజనకరంగా ఉంటాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా పండగల సమయంలో ఎక్కువ డిమాండ్ ఉండే మార్గాల్లో ఈ రైళ్లు సౌకర్యం కల్పిస్తాయి. తాజా పురోగతితో కాజీపేట యూనిట్ పూర్తి కావడంతో తెలంగాణలో రైల్వే రంగం బలపడుతుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
రూ.716 కోట్లు ఖర్చుతో కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైల్వే శాఖ ఈ యూనిట్ను దేశంలోని అత్యాధునిక తయారీ కేంద్రాల్లో ఒకటిగా అభివర్ణించింది. యూనిట్ నిర్మాణానికి సుమారు రూ.716 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ అభివృద్ధి వరంగల్, కాజీపేట ప్రాంతాల ఆర్థిక, పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాజీపేట యూనిట్ దేశవ్యాప్తంగా రైలు ప్రయాణాల నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించేలా కేంద్రం ప్లాన్ చేసింది.













Click it and Unblock the Notifications