నెహ్రూ, ఇందిరా తెలంగాణను ముంచారు: కెసిఆర్
మూర్ఖ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెంటిలేటర్పై ఉందని, ఆ పార్టీ రాష్ట్రం ఇవ్వకపోవడమూ ఒకందుకు మంచిదే. 2014 తరువాత ఎలాగూ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ గెజిటెడ్ అధికారుల సంఘం బుధవారం పబ్లిక్ గార్డెన్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిపిన 'హ్యాండ్ బుక్- డైరీ' ఆవిష్కరణ కార్యక్రమంలో కెసిఆర్ మాట్లాడారు. దుష్ట కాంగ్రెస్ను బొందపెట్టి తెలంగాణను తెచ్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గత అధినేతల బాటలోనే సోనియా కూడా నడుస్తున్నారని, సీమాంధ్రనేతల ఒత్తిళ్లకు లొంగి తెలంగాణ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు.
తెలంగాణపై ఆంధ్రా మేధావులు వైఖరి మార్చుకోవాలని ఆయన సూచించారు. ఈ ఆంధ్రోళ్లను తిడితే ఒక బాధ.. తిట్టకపోతే మరో బాధ అని, వాళ్లకు బుర్రఉంటే, వాళ్లలో మేధావులు ఉంటే ఇలా చేయరని, మంచి మర్యాదతో అన్నదమ్ముల్లా విడిపోయి ప్రేమాభిమానాలతో కలిసి ఉందామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని జోస్యం చెప్పారు. బండ చాకిరీ చేస్తున్న తెలంగాణ ఉద్యోగులపై ఎసిబి దాడులు నిర్వహిస్తున్నతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగులపై ఈగ వాలితే ఊరుకోబోమని హెచ్చరించారు. సిబిఐతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని మండిపడ్డారు.
సీమాంద్రుల ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను తుంగలో తొక్కిందని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ దుయ్యబట్టారు. రాజశేఖర రెడ్డి హయాంలో చక్రం తిప్పిన కెవిపి రామచంద్రరావుపై కేసు ఎందుకు పెట్టరని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. విజయనామ సంవత్సరమే తెలంగాణను సాధించి పెడుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.
12న పొలిట్బ్యూరో సమావేశం...
ఈ నెల 12వ తేదీన తెలంగాణ భవన్లో తెరాస పొలిట్బ్యూరో సమావేశం జరుగుతుందని ఆ పార్టీ వెల్లడించింది. ఆ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల కమిటీ నియామకంతో పాటు 27వ తేదీన నిర్వహించనున్న పార్టీ 12వ వార్షికోత్సవం తదితర అంశాలపై పార్టీ నేతలు చర్చిస్తారని ప్రకటించింది.