సిఎంపై కెసిఆర్ ఫైర్: కెవిపి అరెస్టుకు యాష్కీ
అవినీతి మంత్రులను కిరణ్ కుమార్ రెడ్డి వెనకేసుకు రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దేశ చరిత్రలో మంత్రులు, ఐఏఎస్లు జైలుకు వెళ్లిన దాఖలాలు లేవని కెసిఆర్ అన్నారు. తన మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన శనివారం పర్యటించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం తాము పోరాటం చేయడం వల్లనే అది సాధ్యమైందని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తు కేసులో రాజ్యసభ సభ్యుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆత్మబంధువు కెవిపి రామచంద్రరావును అరెస్ట్ చేయాలని, అప్పుడే అన్ని బాగోతాలు బయటపడతాయని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధుయాష్కి అన్నారు. ఈ కేసులో కెవిపిపై సూరీడు వాంగ్మూలం ఇచ్చినా అరెస్ట్ చేయలేదని, దీని వల్ల సీబీఐపై మచ్చ పడే అవకాశం ఉందన్నారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా సిబిఐ వెంటనే కెవిపిని అరెస్ట్ చేయాలని మధుయాష్కి న్యూఢిల్లీలో డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన అదిలాబాదులో మీడియాతో మాట్లాడారు. దళిత ఎమ్మెల్యేలను దూషించిన ఘనత సీఎం కిరణ్కే దక్కుతుందని ఆయన ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి తెలంగాణ సాధిస్తామని వివేక్ స్పష్టం చేశారు.