జగన్ తతంగం గుర్తించలేకపోయారు: ఆనంకు మద్దతు
ఆనం చెప్పింది కరెక్టేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి పార్థసారథి తదితరులు అన్నారు. మరికొందరు మంత్రులు కూడా ఇదే స్థాయిలో గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారట. ఆనంకు పలువురు సీనియర్ మంత్రులు ఫోన్ చేసి అభినందనలు కూడా తెలిపారు. చాలా బాగా మాట్లాడావని, జగన్ వ్యవహార శైలిపై అసెంబ్లీలో తానుమాట్లాడతానంటే వారించి.. ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా ఈ స్థాయిలో విమర్శలు చేశావేంటని మంత్రి రఘువీరా సరదాగా అన్నారట.
జగన్ను ఉరి తీయాలన్న మంత్రి ఆనం వ్యాఖ్యలను బొత్స సమర్థించారు. అనంతపురం జిల్లా మడకశిరలో శనివారం జరిగిన 'ఇందిరమ్మ కలలు' బహిరంగ సభలో బొత్స మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని జగన్ పార్టీ నేతలపై మండిపడ్డారు. జగన్ పార్టీ నేతల వ్యాఖ్యలు పరిశీలిస్తే ఎవరికి పిచ్చిపట్టిందో అర్థమవుతుందని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
రామరాజ్యం పేరుతో దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం తెస్తారా అని నిలదీశారు. హోంమంత్రి సబితను ఎందుకు జైలులో పెట్టలేదని షర్మిల ప్రశ్నిస్తున్నారు. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు బాగా సంపాదించుకున్నవారు సబితను జైలులో పెట్టాలనడం సరికాదని అన్నారు. జగన్పై మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు మరో మంత్రి పార్థసారథి చెప్పారు. వైయస్ హయాంలోనూ ఆనం మంత్రిగా ఉన్నారని, నాటి పరిస్థితులు ఆయనకు బాగా తెలుసునన్నారు.
అప్పట్లో వెలువడిన జీవోల ద్వారా లబ్ధిపొందింది జగనేనని, బలిపశువులైంది మాత్రం మంత్రులను ఆవేదన వ్యక్తం చేశారు. జీవోలపై మంత్రులు కళ్లు తెరుచుకునే చేశారని, వాటి వెనుకున్న జగన్ తతంగాన్ని గుర్తించలేకపోయారన్నారు. మంత్రి ఆనం చేసిన విమర్శలపై తాను స్పందించలేనని మరో మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. అయితే, సీనియర్ మంత్రిగా ఆనంకు అన్ని విషయాలు తెలుసునని అంగీకరించారు. వైయస్, జగన్ల దోపిడీపై ముందుగా మాట్లాడింది తానేనని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ పేర్కొన్నారు.