అంబేడ్కర్కు నివాళులు: మోత్కుపల్లి వర్సెస్ కోదండరాం
హైదరాబాద్: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాజకీయ ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ట్యాంకుబండుపై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కొండ్రు మురళి, శైలజానాథ్, డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి చిరంజీవి తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. దళితుల అభ్యున్నతికి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ఎంతో ఉపయోగపడుతుందని చిరంజీవి ఈ సందర్భంగా అన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
మోత్కుపల్లి వర్సెస్ కోదండ
అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్యాంకుబండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన టిడిపి నేతలకు వ్యతిరేకంగా జెఏసి కార్యకర్తలు నినాదాలు చేశారు.
దీంతో అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చే అర్హత మీకు లేదంటూ కోదండరామ్ను మోత్కుపల్లి విమర్శించారు. లక్ష రూపాయల జీతం తీసుకుంటూ కోదండరామ్ ఒక్క విద్యార్థికైనా చదువు చెబుతున్నారా? అని ప్రశ్నించారు. ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.
అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహం.. స్పీకర్
అసెంబ్లీ ప్రాంగణంలో త్వరలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సభాపతి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సభా వ్యవహారాల సలహా సంఘం ఆమోదం తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విగ్ర నమూనాపై బిఏసిలో చర్చిస్తామన్నారు.
వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం జిల్లాలోని శృంగవరంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు.