కారుపై ఎర్రలైట్ తొలగింపు: ఎంపి జయప్రద హెచ్చరిక
ఈ రెడ్ లైట్ తొలగించే ప్రక్రియలో దాదాపు ఇరవై నాలుగు మంది అధికారులు పాల్గొన్నారని ఆమె అన్నారు. వారిలో పోలీసులు కూడా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటులో ప్రస్తావిస్తానని జయప్రద హెచ్చరించారు. అధికారులు తన నివాసానికి వచ్చి ఎర్ర లైట్ తొలగించాల్సిన అవసరం లేదన్నారు.
ఎక్కడైనా రోడ్డు మీదనే తనిఖీలు నిర్వహించి ఉండవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నెల 3వ తేదిన జయప్రద ఉన్న ఓ హోటల్ గదిపై జరిగిన దాడి నేపథ్యంలోనే తాజాగా ఆమె వాహనంపై ఉన్న ఎర్ర లైటును తొలగించారు. జయప్రద ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారనే అనుమానంతో రైడ్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
కాగా, 2014 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు జయప్రద ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరులోగా తాను ఏ పార్టీలో చేరేది చెబుతానని ఆమె అన్నారు. 2009 ఎన్నికల్లో ఎస్పీ ఎంపీ అభ్యర్థిగా రాంపూర్ నుండి గెలుపొందారు. ఆ తర్వాత ఆమె అమర్ సింగ్తో పాటు పార్టీ నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎపి రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు.