కెసిఆర్ అజెండా వేరు: పొంగులేటి, దమ్ములేకే.. జగ్గారెడ్డి

తెలంగాణపై కేంద్రం, అధిష్టానం దృష్టి సారించిందన్నారు. దీనిపై చర్చలు జరుపుతోందన్నారు. తెలంగాణపై కీలక నిర్ణయం వెలువడే సమయంలో ఎంపీలు కెసిఆర్ ట్రాప్లో పడటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కెసిఆర్ ఎన్నికల అజెండాతో వెళ్తున్నారని, దాని వల్ల తెలంగాణ రాదన్నారు. తెలంగాణకు కెసిఆర్ ఒక్కరే హీరోనా అని ప్రశ్నించారు. తెలంగాణపై తెరాసకు మాత్రమే పేటెంట్ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. తెరాసలో చేరేందుకు ఎంపీలకు కెసిఆర్ డెడ్ లైన్ పెట్టడమేమిటన్నారు.
కెసిఆర్ ఆహ్వానంపై జానా నో కామెంట్
తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు కెసిఆర్ ఆహ్వానంపై స్పందించేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి నిరాకరించారు. వరంగల్ జిల్లా చిట్యాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఉద్యమం సాగించేందుకు ప్రత్యేక రాజకీయ పార్టీ గానీ, ప్రత్యేక ఫోరం కానీ అవసరం లేదన్నారు. కాంగ్రెసు ఎంపీలకు తెరాస నుండి ఆహ్వానం వచ్చినట్లు తాను పత్రికల్లోనే చూస్తున్నానన్నారు.
పార్టీ బలోపేతానికి ప్రతి రాజకీయ పార్టీ నాయకత్వం కొత్త క్యాడర్ను ఆహ్వానించడం రాజకీయాల్లో సహజమేనన్నారు. 2014లోపు తెలంగాణ ప్రకటించే అవకాశముందని, అధిష్టానంపై ఒత్తిడి తెస్తామన్నారు. జానా రెడ్డి వెంటే భువనగిరి, నల్గొండ పార్లమెంటు సభ్యులు రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు ఉన్నారు.
అభ్యర్థులు లేకే.... జగ్గారెడ్డి
తమ పార్టీకి అభ్యర్థులు లేకపోవడం వల్లనే కెసిఆర్ కాంగ్రెసు పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నారని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి అన్నారు. తమ అభ్యర్థుల కోసం ఇంటింటికి కెసిఆర్ వెళ్తున్నారని, దీనిని బట్టే తెరాస ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. కెసిఆర్ హీనంగా ప్రవర్తిస్తున్నారని, కె కేశవ రావు దిగజారడం బాధాకరమన్నారు.
కెసిఆర్తో సహా మెదక్ నుండి ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదన్నారు. మెదక్ కాంగ్రెసు కంచుకోట అన్నారు. మెదక్లో దమ్ము లేకే కెసిఆర్ ఇతర జిల్లాల నుండి పోటీ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెసు బలమైన పార్టీ అని, చిరంజీవి మరింత బలం కోసమే తన పార్టీని విలీనం చేశారన్నారు.
కెకె కాంగ్రెసులో ఎదిగి వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి.వివేక్ పార్టీని వీడినా నష్టం లేదన్నారు. అయితే, తెలంగాణ ఎంపీలు పార్టీని వీడాలని తాము కోరుకోవడం లేదన్నారు.
సోనియాతో ఆజాద్ భేటీ
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కేంద్రమంత్రి, ఎపి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ భేటీ అయ్యారు. ఆయన రాష్ట్ర రాజకీయాలతో పాటు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆమెకు శాఖ మార్పు తదితరాలపై చర్చించారని సమాచారం.












Click it and Unblock the Notifications