విప్ ధిక్కరించా: జగన్ ఎమ్మెల్యే, అందలేదన్న చిన్నం
అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు తనను కలిసిన విలేకరులతో ఆయన అన్నారు. అందుకు స్వయంగా స్పీకరే ప్రత్యక్ష సాక్షి అని తెలిపారు. తీర్మానానికి సానుకూలంగా ఓటు వేసినందున స్పీకర్ దీనిపై తగు నిర్ణయం తీసుకో వచ్చునన్నారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ విప్ ధూళిపాళ్ల నరేంద్ర ఇచ్చిన విప్ను ధిక్కరించానని బాలనాగిరెడ్డి అంగీకరించారు.
మరోవైపు తాను కూడా నోటీసుకు సమాధానం ఇవ్వనున్నట్టు మరో టిడిపి ఎమ్మెల్యే చిన్నం రామ కోటయ్య వెల్లడించారు. నోటీసుకు లాయర్ల ద్వారా సమాధానం పంపుతున్నానని మీడియాకు ఆయన తెలిపారు. అవిశ్వాస తీర్మానం నాడు శాసనసభకు రానప్పుడు, విప్ ఉల్లంఘించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. విప్ సైతం తనకు అందలేదన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో కాంగ్రెసు పార్టీకి చెందిన తొమ్మిది మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన తొమ్మిది మంది శాసనసభ్యులు తమ తమ పార్టీల విప్లను ధిక్కరించారు. పార్టీ విప్లు స్పీకర్కు ఫిర్యాదు చేయగా ఆయన నోటీసులు పంపారు.