పరకాల మరో పుస్తకం: కాల్చేసిన తెలంగాణవాదులు
పుస్తకాన్ని ఆవిష్కరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై లాఠీఛార్జ్ చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్లో ఉద్రిక్తల నడుమ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడారు. విశాలాంధ్ర బలపడాలనేది తమ ఆకాంక్ష అని, రాష్ట్రం ఒక్కటిగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, తెలుగు జాతి ఐక్యతే లక్ష్యంగా తాము పోరాటం చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రం విడిపోవాలనే భావం సరికాదన్నారు. వేర్పాటువాదుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వారి వాదనలు అన్ని అసత్యాలు, అర్ధ సత్యాలు, అభూత కల్పనలన్నారు. విభజనపై అన్ని అసత్యాలే చెబుతున్నారని ఆరోపించారు. సమైక్యవాదాన్ని బలపర్చేందుకే తమ పుస్తకమన్నారు. తాము రాసిన వాటిని ఎవరూ తప్పు పట్టలేరన్నారు. ఉద్యమం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, తద్వారా పిల్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. విభజన వాదం మట్టికరిచిందన్నారు.
పరకాల మాట్లాడుతూండగా ప్రెస్ క్లబ్లోని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. కావాలనే విష ప్రచారం చేస్తున్నారని నినాదాలు చేశారు. నిర్వాహకులు, తెలంగాణ జర్నలిస్టుల మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణ జర్నలిస్టులు ఆ పుస్తకాన్ని చించి వేసి నిర్వాహకుల పైకి విసిరి వేశారు. కొన్ని పుస్తకాలను లాక్కొని కాల్చి వేశారు. ప్రెస్ క్లబ్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమైంది. పోలీసులు పరకాలతో పాటు ఇతర నిర్వాహకులను వలయంగా బయటకు తీసుకు వెళ్లారు. రుజువులు లేని ఉద్యమం పేరుతో ఆవిష్కరించిన పుస్తకంలో తెలంగాణ వేర్పాటువాదుల 101 అబద్దాలు, వక్రీకరణలు అని ముద్రించారు.