జగన్కి రివర్స్!: కొండా సురేఖ సైలెన్స్, కెసిఆర్ దూకుడు

మరోవైపు తెలంగాణ ప్రాంతంలో మాత్రం జగన్ పార్టీ బలం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే మాదిరిగా ఉందంటున్నారు. అసలు ఆ పార్టీ మనుగడే తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. అందుకు పార్టీకి సంస్థాగతంగా కార్యకర్తలు లేకపోవడం, తెలంగాణ ప్రాంతంలోని నేతల అంతర్గత పోరు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలులో ఉండటం... ఇలా ఎన్నో కారణాలున్నాయంటున్నారు.
జగన్ తెలంగాణపై దృష్టి సారించినప్పుడు భారీగా నేతలు ఆ పార్టీలోకి వెళ్తారని భావించారు. అనుకున్నట్లుగానే ప్రారంభంలో పలువురు ముఖ్యనేతలు జగన్ను జైలులో కలిసి ఆ పార్టీలోకి వెళ్లారు. టిడిపి, కాంగ్రెసుల నుండే కాకుండా తెరాస నుండి కూడా వెళ్తారనే ప్రచారం సాగింది. ఇది తెరాసలో కూడా వణుకు పుట్టించింది. అయితే, క్రమంగా తెలంగాణ ప్రాంతంలో జగన్ పార్టీ పేరు వినిపించడం లేదంటున్నారు.
అంతకుముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ పార్టీ బలోపేతంపై దృష్టి సారించేవారు. నిత్యం ఆమె మీడియాలో నానారు. తెలంగాణ జగన్ పార్టీ నేతల్లో ఆమె ముఖ్య నేత. అలాంటి సురేఖ కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. కొండా సురేఖ మౌనం కూడా ఆ పార్టీ తెలంగాణలో వేళ్లూనుకోక పోవడానికి కారణమంటున్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును నిత్యం సవాల్ చేస్తూనే ఆమె పార్టీ బలోపేతం కోసం పని చేశారు.
కానీ, ఇటీవల ఆమె కనిపించడం లేదు. గోనె ప్రకాశ రావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కెకె మహేందర్ రెడ్డి తదితర నేతలు ఉన్నప్పటికీ వారి వారి నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారంటున్నారు. అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో నేతల మధ్య నేతల మధ్య విభేదాలకే సమయం సరిపోతోందంటున్నారు. ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది పార్టీ బలోపేతానికి పెద్ద ఇబ్బందిగా మారుతోందంటున్నారు. ప్రధానంగా కొండా సురేఖ తన మౌనాన్ని వీడితే పార్టీలో మళ్లీ కొత్త ఉత్సాహం రావడం మాత్రం ఖాయమంటున్నారు.












Click it and Unblock the Notifications