మాజీ ఎంపి ఆదికేశవులు నాయుడు కన్నుమూత

మోకాలి నొప్పితో బాధ పడుతున్న ఆదికేశవులును ఈనెల 19న ఆస్పత్రిలో చేర్చారు. 21వ తేదీన మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే, ఇన్ఫెక్షన్ సోకి మర్నాడే ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. దీంతో, ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. అప్పటి నుంచి ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారింది. మూడు రోజులుగా ఐసీయూలో ఉంచి చికిత్స చేసినా ఫలించలేదు.
సత్యసాయి పరమభక్తుడు..
సత్యసాయిబాబాకు పరమ భక్తుడైన ఆదికేశవులు నాయుడు సత్యసాయి శివైక్యం చెందిన రెండేళ్లకు సరిగ్గా అదే రోజున మరణించడం గమనార్హం. మరణించే సమయానికి ఆయన పక్కన భార్య, కుమారుడు శ్రీనివాసులు, కుమార్తె డాక్టర్ కల్పజ ఉన్నారు. కర్ణాటకలో ఆయనకు పలు వ్యాపార సంస్థలున్నాయి. వైదేహి ఆస్పత్రి ప్రాంగణంలోనే గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఆదికేశవులు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ వర్గాల ద్వారా తెలిసింది.
కాగా, ఆదికేశవులు మృతిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిటిడి చైర్మన్గా, ఎంపీగా, పారిశ్రామికవేత్తగా ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు ఆదికేశవులు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఆయన అన్నారు. ఆదికేశవులు నాయుడు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు.
ఆదికేశవులు ఆకస్మిక మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పాదయాత్రలో ఉండగానే ఆదికేశవులు కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు. ఆదికేశవులు మృతికి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
కేంద్ర మంత్రి చిరంజీవి, కాంగ్రెస్ నేతలు వీహెచ్, డీఎస్, తిరుపతి ఎంపీ చింతా మోహన్, మంత్రి గల్లా అరుణకుమారి, టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహనరావు, సుజనా చౌదరి, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తదితరులు ఆదికేశవులు నాయుడి మృతికి సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications