రోజుల తర్వాత విధులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఈ నెల 8వ తేదీ నుమంచి ఆమె విధులకు హాజరు కావడం లేదు. దీంతో ఫైళ్లు పేరుకుపోయాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచనతో ఆమె శనివారం విధులకు హాజరైనట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితురాలైన సబితా ఇంద్రారెడ్డి రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అధికార కాంగ్రెసు పార్టీకి చెందిన కొంత మంది నాయకులు కూడా ఆమె రాజీనామా చేయాలని అభిప్రాయపడ్డారు.
సబితా ఇంద్రారెడ్డి శాఖను మార్చవచ్చుననే ప్రచారం విస్తృతంగానే జరిగింది. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందుకు విముఖత వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం కూడా సబితా ఇంద్రారెడ్డిని మంత్రిగా కొనసాగించాలనే అభిప్రాయానికే వచ్చింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అన్ని చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత సంభవించే పరిణామాలను బట్టి కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉంది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో వాన్పిక్ వ్యవహారంలో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లో మంత్రి ధర్మాన ప్రసాదరావును నిందితుడిగా చేర్చింది. వైయస్ జగన్ కేసులో ముగ్గురు మంత్రులను ఇప్పటి వరకు సిబిఐ నిందితులుగా చేర్చింది. మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేయగా, ధర్మాన రాజీనామాను ముఖ్యమంత్రి తిరస్కరించారు. అలాగే, సబితా ఇంద్రారెడ్డి రాజీనామాను కూడా అంగీకరించకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు.