ఆకర్ష మంత్రం: రూట్ మార్చి ట్రాప్లో పడేస్తున్న నేతలు
హైదరాబాద్: సాధారణ ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఆయా పార్టీల తీరు మాత్రం ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడు లేని విధంగా 2014 రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం క్లిష్టంగా, గందరగోళంగా ఉండనుంది. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడున్నంత ఆసక్తికరంగా, భిన్నంగా ఎప్పుడు లేవనే చెప్పవచ్చు. ముప్పయ్యేళ్ల క్రితం ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినప్పుడు, ఐదేళ్ల క్రితం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఫలితాలు ఎలా వచ్చినా ఓ క్లారిటీ కనిపించింది. కానీ, ఇప్పుడలా లేదు.
చాలా కాలం తర్వాత వరుసగా రెండుసార్లు రాష్ట్రంలో గెలుపొందిన కాంగ్రెసు మూడోసారి ఆశలు లేకున్నా ప్రయత్నాలు చేస్తోంది. ముప్పయ్యేళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీకి పరీక్షా కాలం కాగా, తెలంగాణవాదం బలపడుతున్న కొద్ది తెరాసకు పోటా పోటీ పార్టీలు తయారవుతుండటంతో పాటు ఒక్కసారిగా ఊపు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ క్రమంగా ఢీలా పడిపోతోంది. మరోవైపు చిన్న పార్టీలుగా ఉన్న భారతీయ జనతా పార్టీ కీలకంగా మారనుంది. సిపిఎం, సిపిఐ, మజ్లిస్లు కూడా బలం పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ వచ్చే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండటంతో ప్రజల్లో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను తమ వైపుకు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలను, ప్రజా ప్రతినిధులపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించిన పార్టీలు, ఆ ప్రభావం బారిన పడిన పార్టీలు ఇప్పుడు కాస్త క్రాస్ ఆపరేషన్ ప్రారంభించారనే చెప్పవచ్చు. ఇప్పుడు వారు ప్రజలను ట్రాప్లో పడేసే పనిలో పడ్డారు!
శనివారం నాడు అధికార పార్టీ కాంగ్రెసు, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు కరీంనగర్, విశాఖపట్నం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆయా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు తమ తమ పథకాలను ప్రజల ముందు ఏకరువు పెట్టారు. ఇప్పుడు ఆయా పార్టీలు రూటు మార్చి పథకాలు, బకాయిల రద్దు అంటూ వాటినే నమ్ముతుంటున్నాయి.
పథకాలే పథకాలు...
అమ్మహస్తం, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక, ఇందిరమ్మ మహాలక్ష్మి, ఇందిరమ్మ కలలు, ఇందిర క్రాంతి పథకం అంటూ పథకాలకు శ్రీకారం చుడుతోంది. మరోవైపు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని పథకాలను తాము వేటిని రద్దు చేయలేదని చెబుతోంది. ఇక విశాఖలో తమ వస్తున్నా మీకోసం పాదయాత్రను ముగించిన టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టిడిపి అధికారంలోకి వస్తే అంటూ పెద్ద చిట్టానే విప్పారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువతకు ప్రత్యేక భృతి ఇస్తామని, ఉద్యోగాలను పారదర్శఖ విధానంలో భర్తీ చేస్తామని, వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, దానిపైనే తాను తొలి సంతకం చేస్తానని, బెల్టు దుకాణాలు రద్దు చేస్తామని, ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తామని, బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, రూ.10వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని, అగ్రవర్ణాలలోని పేదలకు ప్యాకేజీ స్తామని, మహిళల భద్రతకు ప్రత్యేక చట్టాలు తీసుకు వస్తామని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, కుల వృత్తుల వారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, ఎస్సీ వర్గీకరణ తీసుకు వస్తామని హామీల వర్షం గుప్పించారు.
రూటు మార్చిన కెసిఆర్
తెలంగాణ సెంటిమెంటులో బిజెపి, సిపిఐ తదితర పార్టీలు కూడా భాగస్వామ్యం కావడంతో ఆ ఒక్కదాని వల్లనే లాభం లేదని భావించారో ఏమో కానీ కెసిఆర్ ఇటీవల తెలంగాణ వస్తే.. అంటూ పథకాల చిట్టా విప్పుతున్నారు. నిన్న జరిగిన ఆర్మూర్ సభలో పలు తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాగానే... అంటూ కొన్ని హామీలు గుప్పించారు.
తెలంగాణలోని రైతులకు లక్ష రూపాయల చొప్పున రుణ మాఫీ అని, కెజి నుంచి పిజి వరకు ఉచిత నిర్బంధ విద్య, పేదలకు బెడ్ రెండు బెడ్ రూములు, ఒక హాలు, ఒక వంట గదితో ఇల్లు, ఐదేళ్లలో మిగిలు విద్యుత్ సాధించే విధంగా ప్రణాళిక, దళితులకు మూడు ఎకరాల భూమి, కాంట్రాక్టు ఉద్యోగులకు మంగళం, గిరిజనులకు, మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్, ఆలయాలపై ఎండోమెంట్ పెత్తనం రద్దు, ధార్మిక పరిషత్తు ఏర్పాటు, సింగరేణిలో కొత్త గనుల ప్రారంభం, తాగునీటి సౌకర్యం, ప్రతి ఐదు అసెంబ్లీ నియోకవర్గాలకు ఓ జిల్లా, కొత్తగా 14 జిల్లాల ఏర్పాటు 71 నియోజకవర్గాల్లో 71 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని హామీలు గుప్పించారు.
వైయస్ చేశారు.. మేం చేస్తాం..
రంగారెడ్డి జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో వైయస్ విజయమ్మ అధికార, ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను ఈ ప్రభుత్వం నీరుగార్చుతుందని, వాటిని జగన్ అధికారంలోకి రాగానే కొనసాగిస్తారని చెప్పారు. వైయస్ ఆలోచనలను ఈ ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్లడం లేదని మేం తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications