పిక్చర్స్: తెలంగాణలో కెసిఆర్తో ఢీకి కిరణ్ రెడ్డి రెడీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఢీకొట్టడానికే సిద్ధపడినట్లు అర్థమవుతోంది. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆయన సోమవారం చేసిన ప్రసంగం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తెలంగాణ ప్రజల మధ్యనే కెసిఆర్ను ఎండగట్టే పనికి ఆయన పూనుకున్నట్లు అర్థమవుతోంది. వివిధ సంక్షేమ పథకాల పేరుతో ఆయన ప్రజల్లోకి వెళ్తూ కెసిఆర్ ప్రాబల్యాన్ని తగ్గించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో కెసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ సొంత జిల్లా మెదక్లోనే కిరణ్ కుమార్ రెడ్డి తెరాసపై దూకుడు ప్రదర్శించి, ఇక ముందు తాను ఎలా ఉండబోతున్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పారు. బయ్యారం ఖనిజాన్ని తరలిస్తే భూకంపం పుట్టిస్తానని కెసిఆర్ చేసిన ప్రకటనకు ఆయన సవాల్ విసిరారు. పైగా, ఉద్యమం పేరుతో పిల్లల చదువులు పాడు చేస్తున్నారని, ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని ఆయన కెసిఆర్పై సూటిగానే విమర్శించారు.
అంతకు ముందు, శనివారంనాడు కరీంనగర్ జిల్లా వంగరలో ఆయన ఇందిరమ్మ కలలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వంగర మాజీ ప్రధాని పివి నర్సింహారావు స్వగ్రామం కావడం విశేషం. ఈ సమావేశంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తెలంగాణ వాదాన్ని ఎత్తినా ఆయన ఆవేశానికి గురి కాలేదు. తెలంగాణ అంశం తన చేతుల్లో లేదని, కేంద్రం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.
తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే ముఖ్యమంత్రి తెలంగాణకు అడ్డుపడుతున్నారని కాంగ్రెసు నాయకులు కూడా విమర్శిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో తనకు లభించిన ప్రోత్సాహాన్ని చూసి సంగారెడ్డి సభలో కిరణ్ కుమార్ రెడ్డి రెచ్చిపోయినట్లే కనిపించారు. తెరాసకు సవాల్ విసిరారు. ఇక ముందు కూడా తెరాసకు ఆయన సవాల్ విసరడానికే సిద్ధపడినట్లు అర్థమవుతోంది.

తెలంగాణలో తన తన జట్టు మంత్రుల అండదండలతో ఇలా తిరుగుతూ తెరాస అధ్యక్షుడు కెసిఆర్ను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్దమైనట్లే కనిపిస్తున్నారు. సంగారెడ్డిలో ఆయన ఇలా కనిపించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ దూరంగా ఉన్నా మిగతా మంత్రుల సహకారంతో ఆయన ఊరేగడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.

మెదక్ జిల్లా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో ఇలా.. తన సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణవాదాన్ని తిప్పికొట్టాలనే ఎత్తుగడలో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు.

కెసిఆర్కు, ఆయన పార్టీ తెరాసకు సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి నిత్యం సవాల్ విసురుతున్నారు. ముఖ్యమంత్రికి ఆయన అనుంగు అనుచురడిగా మారిపోయారు. ఇటువంటి జట్టు ఒకటి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో ఏర్పడినట్లే ఉంది.

కరీంనగర్ వంగర గ్రామంలో శనివారం అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి. కరీంనగర్ జిల్లాతో తనకు గల అనుబంధాన్ని కూడా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెసు పార్టీ పివి నర్సింహారావుకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే విమర్శ చాలా కాలంగా ఉంది. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పివి నర్సింహారావు విగ్రహాన్ని అవిష్కరించారు. పివి కుటుంబ సభ్యుల్లో ఒకరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications