జగన్ పార్టీకీ అదే గతి, మేం తలదించుకోవాల్సిందే: బొత్స

కర్నాటకలో భావోద్వేగాలతో పుట్టుకు వచ్చిన బిఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగయిందన్నారు. బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ అవినీతిని అక్కడి ప్రజలు గుర్తించారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోను భావోద్వేగాలతో పుట్టుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిఎస్సార్ కాంగ్రెసులాగే కనుమరుగు కాక తప్పదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తప్పు చేశారని తేలితే తాము కూడా తలదించుకోవాల్సి వస్తుందన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. బెల్టు షాపులు ఎత్తివేస్తానని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వడ్డీలేని రుణాలు అంటూ బాబు కొత్త పాట పాడుతున్నారని, కాంగ్రెసు పార్టీ అదెప్పుడో చేసిందన్నారు. పథకాల పేరుతో బాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆరోపణలకు ఆయన కుటుంబ సభ్యులే సమాధానం చెప్పాలన్నారు.
బాబువి పగటి కలలు.. వట్టి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారని మంత్రి వట్టి వసంత్ కుమార్ వేరుగా అన్నారు. ఆయనకు పగటి కలలు కనడం కొత్తేమీ కాదన్నారు. 2009 ఎన్నికలు పూర్తయ్యాక టిడిపి ఇంతకంటే ఎక్కువ సంబరాలు చేసుకుందన్నారు. బాబుకు ఇవే చివరి ఎన్నికలన్నారు.
కోర్టుకు వెళ్తా.. కోట్ల
జగన్ కాంగ్రెసు పార్టీలోకి వస్తే బెయిల్ వస్తుందని తాను చెప్పినట్లుగా ఆధారాలు చూపిస్తే దేనికైనా సిద్ధమని, తాను అలా వ్యాఖ్యానించలేదని రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. దీనిపై వారు క్షమాపణలు చెప్పాలని లేదంటే న్యాయపరంగా వారి ఆరోపణలను ఎదుర్కొంటానని చెప్పారు.
అవినీతితో పుట్టిన పార్టీలు
బిఎస్సార్ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అవినీతితో పుట్టిన కవలలు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కర్నాటకలోని బళ్లారి ఎన్నికల ప్రచారంలో అన్నారు. సిపిఐ తరఫున బళ్లారిలో పోటీ చేస్తున్న అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. మాఫియా పార్టీలకు ఓటు వేయవద్దన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసు మంత్రులు అవినీతి కార్యకలాపాలకు చిరునామాగా మారారన్నారు.












Click it and Unblock the Notifications