జగన్ పార్టీలో అసమ్మతి సెగ: ఉమ్మారెడ్డితో వాగ్వాదం
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు తెనాలి ఇంఛార్జీ బాధ్యతలను అప్పగించారు. దీనిపై స్థానిక నాయకులు మండిపడుతున్నారు. స్థానికేతరుడు అయిన ఉమ్మారెడ్డికి తెనాలి నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఉమ్మారెడ్డితో స్థానిక నేతలు ఆగ్రహంతో వాగ్వాదానికి దిగారు.
కాగా, జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో బుధవారం విభేదాలు వరుసగా బయటపడుతున్న విషయం తెలిసిందే. బుధవారం జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బ్రహ్మానంద రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి బంధువు కొండారెడ్డి మధ్య కడప జిల్లాలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంఛార్జీ పదవి విషయంలో గొడవ రాజుకుంది. తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తర్వాత పలువురు కల్పించుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
మరోవైపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోను మరోసారి విభేదాలు బయటపడ్డాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ మురళీధర్, మరో నేత కొమ్మి లక్ష్మినాయుడు, కాకానిల మధ్య ఈ రోజు విభేదాలు బయటకు వచ్చాయి. జిల్లా కార్యాలయంపై ఆధిపత్య పోరు నడుస్తోంది. మేకపాటి సోదరుల ప్రోత్సాహంతో కన్వీనర్గా ఎన్నికైన మురళీ కార్యాలయానికి రాగా, కాకాని వర్గం తాళం వేసింది. దీంతో మురళీ కార్యాలయం బయటే మీడియా సమావేశం నిర్వహించారు.