జగన్పై బాబు వ్యూహం: తిరగబడుతున్న అస్త్రాలు?

కడప జిల్లా ఇడుపులపాయలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పెద్ద యెత్తున భూములు సంపాదించిందనే అనుమానం తెలుగుదేశం పార్టీకి ఉంది. దీన్ని ఫొటోలతో సహా నిరూపించేందుకు అప్పుడు తెలుగుదేశం ఏకంగా హెలికాఫ్టర్ ఉపయోగించిందని, చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నేత, పారిశ్రామిక వేత్త ఆదికేశవులు నాయుడు ఇచ్చిన హెలికాప్టర్తో పిఎన్వి ప్రసాద్ సాహసోపేతంగా ఇడుపులపాయ ఫొటోలు తీసుకుని వచ్చి మీడియాలో వచ్చేట్టు చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.
వైయస్ రాజశేఖర రెడ్డి నిమిషానికి ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారో, నిమిషాల లెక్కలు చెప్పి చంద్రబాబు ప్రజలను ఆశ్చర్యచకితులను చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ నిమిషాల లెక్క తేల్చింది పిఎన్వి ప్రసాదే. ఆదికేశవులు నాయుడు తెలుగుదేశం పార్టీని వీడి పార్లమెంటులో కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేసి కాంగ్రెస్ వైపువెళ్లారు.
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ సాహసోపేతంగా హెలికాఫ్టర్ ద్వారా ఫొటోలు తీసుకువచ్చిన పిఎన్వి ప్రసాద్ ఇప్పుడు జగన్ పార్టీలో చేరారు. సీనియర్ నాయకులను ఎంతో మందిని పక్కన పెట్టి అప్పట్లో పిఎన్వి ప్రసాద్కు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో ఆయనది కీలక పాత్ర. అలాంటి నేత జగన్కు అంతరంగికుడిగా మారిపోవడం చంద్రబాబుకు తీవ్రమైన ఎదురదెబ్బనే.
జగన్పై ఆర్థిక నేరాలకు సంబంధించి దాడి చేసే బాధ్యత తొలుత ఎంవి మైసూరారెడ్డికి తెలుగుదేశం పార్టీ అప్పట్లో అప్పగించింది. తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని జగన్ ఆర్థిక ప్రయోజనాలు పొందారని ఎంవి మైసూరా రెడ్డి మొదటి నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. వైయస్సార్ అవినీతిని వివరిస్తూ రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో టిడిపి ప్రచురించిన పుస్తకం రచనలో మైసూరా రెడ్డిదే కీలక పాత్ర. వివిధ కంపెనీల్లో పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయి, జగన్ నిబంధనలు ఉల్లంఘించి ఆర్థిక నేరాలకు ఏ విధంగా పాల్పడ్డారో మైసూరా రెడ్డి వివరిస్తూ తీవ్ర స్థాయిలో జగన్పై ధ్వజమెత్తారు.
రాజ్యసభ సభ్యునిగా తన పదవీ కాలం ముగిసిన తరువాత మైసూరా రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలుత కుంభకోణం సైజును వందల కోట్లతో తయారు చేశాం, ఆ అంకె బాబుకు కంటికి ఆనలేదు, దాంతో వరుసగా సున్నాలు చేరుస్తూ పోయి లక్ష కోట్లకు తీసుకు వచ్చామని ఆనాటి ఆరోపణలపై మైసూరారెడ్డి చెప్పుకొచ్చారు. మైసూరా రెడ్డి తరువాత జగన్పై ఆరోపణల బాధ్యత ప్రధానంగా దాడి వీరభద్రరావు, ఎ రేవంత్ రెడ్డి, వర్ల రామయ్యలకు అప్పగించారు.
చివరకు దాడి వీరభద్రరావు జగన్ పార్టీలో చేరారు. జగన్ గురించి తెలుగుదేశం పార్టీ ఏం చెప్పాలని సూచించిందో అదే చెప్పానని, తాను ఊహించిన జగన్ వేరు, చూసిన జగన్ వేరు అని దాడి వీరభద్రరావు కొత్త మలుపు ఇస్తున్నారు. ఏమైనా, చంద్రబాబుకు ఎదురు తిరుగుతున్న నేతల తీరు చూస్తే సీన్ రివర్స్ అవుతున్నట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications