ఎన్టీఆర్ విగ్రహం: అత్తతో జూనియర్, బాబుతో బాలయ్య
న్యూఢిల్లీ/ హైదరాబాద్: పార్లమెంటు ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరోసారి విభేదాలు బట్టబయలు అయ్యాయి. నారా - నందమూరి కుటుంబాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఈ సందర్భంగా కనిపించాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా దాదాపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
కార్యక్రమానికి హాజరైన నారా, నందమూరి కుటుంబ సభ్యులు విగ్రహావిష్కరణ తర్వాత ఎవరికి వారు విగ్రహం ముందు నించుని ఫొటోలు తీయించుకున్నారు. ఈ ఫొటోలు దిగే కార్యక్రమంలో విభేదాలు స్పష్టంగా కనిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ అత్త, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఫొటో దిగారు. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, హీరో కళ్యాణ్ రామ్ కూడా వారితో పాటు ఫొటో దిగారు.

కాగా, హీరో బాలకృష్ణ మాత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి ఫొటో దిగారు. ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి తన దారి తనదన్నట్లు వ్యవహరించారు. విగ్రహావిష్కరణకు అందరూ హాజరైనా ఎవరి దారి వారిదన్నట్లు వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ మీరా కుమార్ ఆహ్వానంతో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చారు.
తెలంగాణ ట్విస్ట్
ఇదిలావుంటే, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు తెలంగాణ ట్వస్ట్ ఇచ్చారు. పార్లమెంటు ఆవరణలో మాజీ ప్రధాని పివి నర్సింహారావు విగ్రహం లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలంగాణ బిడ్డ కాబట్టే పివి విగ్రహం లేదని ఆయన మంగళవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఢిల్లీలో పివి ఘాట్ కూడా లేదని ఆయన అన్నారు.
పివి నర్సింహారావు విగ్రహం లేకపోవడంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఎందుకు స్పందించడం లేదని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తిపై కూడా కాంగ్రెసు వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. పివి విగ్రహ ప్రతిష్టాపనపై ప్రధాని, స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications