ఢిల్లీలో లక్ష్మీపార్వతి హంగామా: బాబును అడిగి మరీ...
బాబుతో పాటు కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరి, హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ సహా అందరినీ పేరుపేరునా ఆమె పలకరించారు. స్పీకర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో పాటు ముందు వరుసలో ఉన్న చంద్రబాబు పక్కనే లక్ష్మీపార్వతి నిలబడ్డారు. చంద్రబాబును అడిగి మరీ ఆయన చేతిలో ఉన్న గులాబి రేకుల్లో సగం తీసుకుని ఎన్టీఆర్ విగ్రహంపై వేశారు. తాను ఎన్టీఆర్ భార్యనని కొందరికి పరిచయం చేసుకున్నారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబం మొత్తం మళ్లీ కలుసుకున్న సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరించానని, ఎవరూ తనను చూసి చిరాకు పడలేదని చెప్పారు. మీరాకుమార్ తనతో మాట్లాడారని, ఎవరినీ ఆహ్వానించలేదని చెప్పారన్నారు. తాను స్పీకర్కు క్షమాపణలు కూడా చెప్పానన్నారు. అందరూ ఒకే వేదికపైకి రావడంపై లక్ష్మీ పార్వతి ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు మరుపురాని ఘటన అని, అందరు ఒకేచోట చేరడం ఆనందం కలిగించిందన్నారు.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో తనను తానే మర్చిపోయానని, విగ్రహావిష్కరణకు పూనుకున్న పురంధేశ్వరికి కృతజ్ఞతలు అని, తాను ఏమైనా అంటే మనసులో పెట్టుకోవద్దని ఆమె అన్నారు. వ్యక్తిగతంగా ఎవరికి ఆహ్వానాలు పంపలేదని మీరా కుమార్ చెప్పారన్నారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు, తాను మాట్లాడుకున్నట్లు చెప్పారు. అంతా సానుకూల వాతావరణం కనిపించిందన్నారు. ఇది మరుపురాని, మర్చిపోలేని అనుభూతి అన్నారు.