పార్టీలో ఉత్కంఠ: రేపే జగన్ బెయిల్ పిటిషన్పై తీర్పు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పదకొండు నెలలుగా జైలులో ఉంచారని, దర్యాఫ్తు పూర్తయినందున బెయిల్ ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదించారు. జగన్ బెయిల్ పిటిషన్ పైన ఈ నెల 6వ తేదీన అతని తరఫు లాయరు వాదించారు. జగన్ ఎక్కడకు పారిపోరని, ఎన్నికలు వస్తున్నందున పార్టీని సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.
జగన్ కేసులో సిబిఐ అసంబద్ద వాదనలను వినిపిస్తుందన్నారు. హైకోర్టులో వాదనలకు, సుప్రీం కోర్టులో వాదనలకు పొంతన లేదన్నారు. జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశమే లేదన్నారు. దర్యాఫ్తు పూర్తయిన తర్వాత ఇంకా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశమెక్కడిదన్నారు. జగన్ పారిపోయే వ్యక్తి కాదని, ఏడాదిగా జైలులో ఎందుకు ఉంచారన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్కు ఇతరులతో సంబంధం ఉందని, అందుకే ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఆడిటర్ విజయ సాయి రెడ్డిల తీర్పును రిజర్వ్లో ఉంచామని జడ్జి సదాశివం అన్నారు. తాము ముందస్తు బెయిల్ అడిగితే తప్పు కానీ, జైల్లో ఉండగా బెయిల్ కోరితే తప్పేంటన్నారు. మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని కోరారు.
కాగా, విచారణ సందర్భంగా వైయస్ జగన్ భార్య భారతి రెడ్డి సుప్రీం కోర్టుకు వచ్చారు. జగన్ తరఫు లాయరు వాదనలు పూర్తయిన తర్వాత సిబిఐ తరఫు లాయర్ అశోక్ బాన్ తమ వాదనలు వినిపించారు. జగన్ బెయిల్కు అనర్హుడని, సిమెంట్ కంపెనీలపై విచారణ కొనసాగుతుందని చెప్పారు. బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం పడుతుందన్నారు. భారతి, ఇండియా, పెన్నా తదితర సిమెంట్ కంపెనీలకు ప్రభుత్వం నుండి లబ్ధి జరిగిందన్నారు.
తాము ఆరు దేశాలకు లేఖలు రాశామని, పెట్టుబడులపై ఆరా తీస్తున్నామని, తమ అధికారులు ఆయా దేశాల్లో పర్యటించి విచారణ జరుపుతున్నారన్నారు. ఈ దశలో బెయిల్ ఇవ్వవద్దన్నారు. వాదనల సమయంలో.. విచారణలో జగన్ పాత్ర ఏమిటని, జగన్ కస్టడీ కొనసాగింపు ఎందుకు అవసరమో చెప్పాలని జడ్జి సిబిఐ లాయర్ను ప్రశ్నించారు.