రాహుల్కు మీరే చెప్పండి: తెలంగాణ ఎంపిలతో ఆజాద్
తమకు ప్రత్యేకంగా సమయం కావాలని తెలంగాణ ఎంపీలు కోరడంతో బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆజాద్ వారితో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. రాహుల్తో భేటీకి తాను హాజరు కాబోనని, నేరుగా రాహులే అందరితో మాట్లాడుతారని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలను రాహుల్ అడిగి తెలుసుకుంటారని చెప్పారు. కాబట్టి, సమావేశంలో ఇరు ప్రాంతాల ఎంపీల మధ్య విభేదాలు బయటపడకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
తెలంగాణపై మాట్లాడేందుకు రాహుల్నూ ప్రత్యేకంగా సమయం కోరాలని సూచించారు. ఈ బాధ్యతను సీనియర్ ఎంపీపాల్వాయి గోవర్థన్ రెడ్డికి ఆజాద్ అప్పగించారు. ఇరు ప్రాంతాల ఎంపీలు ఐక్యంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన అంశాలపైనే రాహుల్తో మాట్లాడాలని తెలిపారు.
కాగా, 2004లో తెరాసతో పొత్తు పెట్టుకుని, 2009లో రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించి ఇప్పుడు ఏమీ చేయకుండా ఎన్నికలకు వెళితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోతుందని తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆజాద్కు స్పష్టంచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తప్ప తాము ప్రజల్లోకి వెళ్లలేమని, తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే ప్రజలు కాంగ్రెస్ వైపు చూడరని వివరించారు.
ఎన్నికల దగ్గరపడుతున్నందున తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని, లేదంటే పార్టీ తీవ్రంగా దెబ్బతింటుందని వెల్లడించారు. కర్ణాటకలో లాగే ఆంధ్రాలో కూడా పార్టీ విజయం సాధించాలంటే తెలంగాణ ఇవ్వక తప్పదని వి. హనుమంతరావు స్పష్టంచేశారు.
ఎంపీలు చెప్పినదంతా విన్న ఆజాద్ - ఈ ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని, తెలంగాణకు ఇతర రాష్ట్రాల డిమాండ్లకు పొంతన లేదన్న సంగతి కూడా తనకు తెలుసునని సముదాయించారు. ఇవన్నీ అధిష్ఠానానికి వివరిద్దామన్నారు. కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, ఎంపీలు అంజన్కుమార్ యాదవ్, ఎంఏ ఖాన్ మినహా ఉభయసభల్లోని మిగతా టీ కాంగ్రెస్ ఎంపీలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.