కొండా సురేఖకు బిజెపి గాలం: కిషన్ రెడ్డి ఫోన్
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే, తెలంగాణ నాగారా సమితి నాయకుడు, శాసనసభ్యుడు నాగం జనార్డన్ రెడ్డి బిజెపిలో చేరడానికి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు కొండా దంపతులు చేరితే పార్టీ బలపడుతుందని వారు భావిస్తున్నారు.
పార్టీలో చేరితే తగిన హోదా కల్పిస్తామని కూడా కిషన్ రెడ్డి కొండా దంపతులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాము ఈ నెల 12, 13 తేదీల్లో ఈ విషయంపై నిర్ణయం ప్రకటిస్తామని కొండా దంపతులు చెప్పినట్లు సమాచారం. కార్యకర్తలతో సమావేశమైన తర్వాత వారి అభిప్రాయాలు తీసుకుని తాము నిర్ణయం తీసుకుంటామని కొండా దంపతులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, వారిని ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. దీంతో ఇంటికి వెళ్లి కొండా దంపతులతో మాట్లాడాలని ఆయన వరంగల్ జిల్లా నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ దంపతులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో గానీ బిజెపిలో గానీ చేరవచ్చుననే వార్తలు వచ్చాయి. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కొండా సురేఖ దంపతులు గతంలో తీవ్రంగా దాడి చేశారు. కెసిఆర్ను విమర్శలతో అదరగొట్టారు. అయితే, వాటిని మరిచిపోయి, తెరాస నాయకులు వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, కొండా దంపతులు బిజెపివైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.