హ్యాపీగా గడిపి..: భోజనం ముట్టని జగన్!, భారతి నిరాశ
హైదరాబాద్/న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో తనకు చుక్కెదురు కావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భోజనం కూడా ముట్టలేదట. అక్రమాస్తుల కేసులో అరెస్టైన జగన్ ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో బెయిల్ వస్తుందన్న ధీమాతో మూడు రోజులుగా ఉత్సాహంతో జగన్ గడిపారట.
గురువారం కోర్టు తీర్పుపై ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూశారు. బెయిల్ రాలేదన్న విషయం తెలిసిన వెంటనే మనస్తాపానికి గురైనట్లుగా సమాచారం. మధ్యాహ్నం నుంచి జగన్ బ్యారక్కే పరిమితమై, తోటి విఐపి ఖైదీలతోనూ మాట్లాడేందుకు నిరాకరించినట్టు సమాచారం. రోజంతా ముభావంగా ఉన్న జగన్ భోజనం సైతం ముట్టలేదట.
నిరాశలో భారతి
బెయిల్ పిటిషన్ పైన తీర్పు సమయంలో వైయస్ జగన్ సతీమణి భారతి సుప్రీం కోర్టుకు వచ్చారు. సుప్రీం తీర్పు కోసం ఆమె ఉత్కంఠతో ఎదురు చూశారు. భారతితో పాటు ఆడిటర్ విజయ సాయి రెడ్డి, వైయస్ తోడల్లుడు వైవి సుబ్బా రెడ్డి, పారటీ నేతలు జూపూడి ప్రభాకర్, మారెప్ప తదితరులు కూడా ఉన్నారు.
ఈ సమయంలో ఒకటి రెండుసార్లు కోర్టులోనికి వెళ్లేందుకు అనుమతించాలని సిబ్బందిని భారతి కోరినా, వారు నిరాకరించడంతో బయటే ఉండిపోయారు. న్యాయమూర్తి తీర్పు చదువుతున్నప్పుడు ఆమె ఆసక్తితో విన్నారు. జగన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించినట్లు ప్రకటించడంతో ఆమె ముఖం వాడిపోయింది. తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఆమె నిరాశగా హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు.