జగన్కు నో బెయిల్: వారిద్దరు పార్టీని లీడ్ చేయగలరా?

కానీ జగన్కు బెయిల్ రాకపోవడం ఆ పార్టీని కుంగదీసింది. సిబిఐకి గతంలో సుప్రీం కోర్టు తుది ఛార్జీషీటుకు గడువు విధించిందని, అందుకే జగన్కు బెయిల్ వస్తుందని నాయకులు, కార్యకర్తలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. మరో నాలుగు నెలల వరకు జగన్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికి కూడా బెయిల్ వస్తుందా? అనేది అనుమానమే. గురువారం కోర్టు తీర్పు అనంతరం సిబిఐ తరఫు లాయరు బయటకు వచ్చి కోర్టు తమకు నాలుగు నెలల గడువు ఇచ్చిందని, ఆ తర్వాత తాము పొడిగించే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. ఇది జగన్ పార్టీని డైలమాలో పడేసింది.
జగన్కు బెయిల్ రాకపోవడం, పార్టీలో అసంతృప్తుల బెడద నేపథ్యంలో క్యాడర్లో నిస్తేజం కలగకుండా ఉండేందుకు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తదితరులు పత్రికా ముఖంగా ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే, వారి ధైర్యం ఏ మేరకు పని చేస్తుందనే చర్చ సాగుతోంది. సెంటిమెంట్ కారణంగా గతంలో పార్టీ అద్భుత విజయం సాధించిందని, సాధారణ ఎన్నికల నాటికి జగన్ బయటకు వస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని, లేకుంటే కష్టకాలం తప్పదని క్యాడర్ ఆందోళన చెందుతోందని అంటున్నారు.
అసంతృప్తులు, జగన్ బెయిల్ నిరాకరణ నేపథ్యంలో పార్టీ భవిష్యత్తు పైన క్యాడర్ ఆందోళన చెందుతుందనే ప్రచారం సాగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి వస్తే పార్టీకి ఇక్కట్లు తప్పవని, నిర్ణీత సమయంలో వస్తే మాత్రం అప్పటికి జగన్ బయటకు వచ్చే అవకాశాలు ఉండటంతో ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నారట. బెయిల్ రాని పక్షంలో అప్పడు కూడా ఇబ్బందులు తప్పవంటున్నారు. జగన్ లేని పక్షంలో విజయమ్మ, షర్మిలలు పార్టీని లీడ్ చేయగలరా? అసంతృప్తులను చల్లార్చే శక్తి వారికి ఉందా? అనే చర్చ సాగుతోంది. జగన్కు బెయిల్ రాక.. పార్టీకి ఇబ్బందులు వస్తే కొందరు పార్టీ వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, విజయమ్మ సీనియర్ల సలహాలతో పార్టీని సమర్థవంతంగా లీడ్ చేయగలరని పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు.












Click it and Unblock the Notifications