జగన్తో భేటీ: దిగొచ్చిన కొండా సురేఖ దంపతులు

పార్టీ నాయకత్వంపై తమకు అసంతృప్తి లేదని, తాము వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉంటామని వారు స్పష్టం చేశారు. తమకు పార్టీపై అసంతృప్తి లేదని, వరంగల్ జిల్లాలోని కొన్ని పరిణామాల వల్ల తాము బాధపడ్డామని కొండా సురేఖ చెప్పారు. పార్టీలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయని, వాటిపై పార్టీ అధినేత నుంచి స్పష్టత వచ్చేంత వరకు మీడియా ముందుకు రావద్దని అనుకున్నామని ఆమె చెప్పారు.
ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని తాము అలక వహించినట్లు అందిన సమాచారంలో నిజం లేదని తాము జగన్కు చెప్పినట్లు ఆమె తెలిపారు. పార్టీలో చాలా రోజులుగా పనిచేస్తున్నామని, తమ జిల్లాలోని రాజకీయ పరిణామాల వల్ల, తమ వర్గానికి అన్యాయం జరిగినందున తాము బాధకు గురయ్యామని చెప్పామని ఆమె వివరించారు. వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటానని జగన్ చెప్పినట్లు సురేఖ తెలిపారు.
పార్టీకి అండగా ఉండాలని విజయమ్మ, జగన్ కోరారని ఆమె చెప్పారు. వైయస్ కుటుంబాన్ని తాము వదిలిపోలేదని, వదిలే ప్రసక్తి లేదని సురేఖ స్పష్టం చేశారు. తమ సొంత బాధను జగన్కు వివరించినట్లు చెప్పారు. తమ బాధ తొలగిపోయిందని చెప్పారు. ఇక పూర్తి స్థాయిలో పనిచేస్తామని, విజయమ్మకూ షర్మిలకూ అండగా ఉంటామని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తాము శ్రమిస్తామని అన్నారు. తమపై పార్టీ కార్యకర్తలు నిద్రలో కూడా అనుమానాలు పెట్టుకోవద్దని సురేఖ కోరారు.
కొండా సురేఖ దంపతులు సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో భేటీ అయిన విషయం తెలిసిందే. అప్పుడే, పార్టీ నాయకత్వంతో కొండా దంపతులకు ఓ అవగాహన కుదిరింది.












Click it and Unblock the Notifications