నేను వైయస్లా కాదు.. కిరణ్ విధేయత!, సబితకి అండ
ఇటీవల ముఖ్యమంత్రి పైన తోటి మంత్రులు, పార్టీకి చెందిన సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పలువురు నేతలు ఢిల్లీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారట. ఆయన ఒంటెత్తు పోకడలతో వెళ్తున్నారని, పథకాలతో పాటు పలు కార్యక్రమాలపై ఆయన ఎవరికి చెప్పకుండా, సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు ఫిర్యాదు చేశారట. దీంతో అధిష్టానం కిరణ్ తీరు పట్ల అసంతృప్తితో ఉందట.
అధిష్టానం తన పట్ల అసంతృప్తితో ఉన్న విషయాన్ని గుర్తించిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ అపోహ తొలగించే ప్రయత్నం కూడా ఈ పర్యటనలో చేస్తున్నారని అంటున్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఇప్పుడు కాంగ్రెసు పార్టీ ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా రాష్ట్రంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మరొకరికి అలాంటి స్వేచ్ఛను ఇవ్వవద్దని ఇప్పటికే నిర్ణయించుకుంది.
కిరణ్ ఒంటెత్తు పోకడ ప్రచారం నేపథ్యంలో ఆయన పట్ల అధిష్టానం అసంతృప్తితో ఉంది. అయితే, తాను వైయస్లా సొంత అజెండాతో, ఏకపక్షంగా వెళ్తున్నాననే అభిప్రాయం సరికాదని, తాను అధిష్టానానికి విధేయుడననే అని ఢిల్లీలో చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సోనియాతో అరగంట పాటు సమావేశమైన కిరణ్ పలు అంశాలపై వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తనపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని చెప్పారు. మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలతో పాటు మంత్రి పార్థసారథిని కూడా వెనుకేసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. సబిత శాఖ మార్పుపై చర్చించారని సమాచారం. జగన్ ఆస్తుల కేసులో సబిత, ధర్మానల తప్పు శాఖల పరంగా ఏమీ లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.