జగన్ అరెస్ట్కు ఏడాది, నిరసనలు: తెలంగాణలో యాత్ర
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మే 27న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని, జగన్ విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని సూచించారు. గవర్నర్ లేదా రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వాలని సూచించారు.
పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలువాలంటే గ్రామస్థాయిలో నాయకత్వం బలంగా ఉండాలని, మంచి నాయకులను ఎంచుకోవాలని సూచించారు. పార్టీ బలాన్ని కొంతమంది చీల్చాలని చూస్తున్నారని, స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ఓ సైనికుడిలా పని చేయాలని, కార్యకర్త నుండి నాయకుడి వరకు కష్టపడి పని చేయాల్సిందేనని లేదంటే ఉపేక్షించేది లేదన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భావం నుండే కాంగ్రెసు, టిడిపిలు కలిసి పని చేస్తున్నాయన్నారు. నాయకులు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని, వారికి అందుబాటులో ఉండాలని, అప్పుడే పార్టీ బలంగా తయారవుతుందన్నారు. అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇక నుండి ఒక్క రోజును కూడా వృధా చేయవద్దన్నారు. అందరూ కష్టపడి పని చేయాల్సిందేనని చెప్పారు. ఈ ఏడాది కీలకమని, స్థానిక ఎన్నికలు సెమీ ఫైనల్స్ వంటివని చెప్పారు. అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు.
విజయమ్మ ఓదార్పు యాత్ర లేదా బస్సు యాత్ర
తెలంగాణ ప్రాంతంలో విజయమ్మ త్వరలో బస్సు యాత్ర లేదా ఓదార్పు యాత్ర చేపట్టే అవకాశాలు ఉన్నాయని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. తమ పార్టీలోని వారందరి లక్ష్యం జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే అన్నారు. పార్టీలో అసంతృప్తులు ఉన్నారనే మీడియా ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సమావేశంలో నిర్ణయించారు.