సబిత, ధర్మానల పోరు: దానం సంచలనం, జగన్పై ఫైర్

మంత్రి పదవులకు రాజీనామా చేసిన వారు ఇప్పటికే తాము న్యాయపోరాటం చేస్తామని సన్నిహితులతో చెప్పిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే వారు వ్యక్తిగతంగా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కోర్టులో వారు త్వరలో రివ్యూ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తమ పేర్లను ఛార్జీషీటు నుండి తొలగించాలని వారు న్యాయపోరాటం చేయనున్నారు.
మరోవైపు సబితా ఇంద్రా రెడ్డికి, ధర్మాన ప్రసాద రావులకు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు సంఘీభావం తెలిపారు. కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్... సబితా రెడ్డి ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సబిత వర్గం ఆయనను ఘెరావ్ చేసింది. ఈ సందర్భంగా దానం మాట్లాడారు. సబితా రెడ్డి వల్లనే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెసు బలపడిందన్నారు.
సబితా వంటి నేతల రాజీనామాలను ఆమోదిస్తే మంత్రివర్గ నిర్ణయాలకు విలువ లేకుండా పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సబిత రాజీనామాను ఆమోదించిన పక్షంలో 26 జివోలతో సంబంధమున్న మిగతా మంత్రులందరు రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. సబితా ఇంద్రా రెడ్డి పార్టీ కోసం పని చేసిన వ్యక్తి అన్నారు. ఎవరో చేసిన దానికి ఆమెను బలి చేయడం సరికాదన్నారు.
జగన్పై రామచంద్రయ్య మండిపాటు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్రూవర్గా మారి మంత్రులు, అధికారులను రక్షించాలని సి.రామచంద్రయ్య అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మంత్రులు రాజీనామా చేస్తున్నారన్నారు. జగన్ ధన దాహమే దీనికంతటికీ కారణమన్నారు. రాజీనామా చేసిన మంత్రుల పట్ల సానుభూతి ఉందన్నారు.












Click it and Unblock the Notifications