మావారు ఉత్తముడని..: వైయస్ భారతిపై బొత్స విసుర్లు

మా వారు ఉత్తముడని కొంత మంది వీధుల్లో తిరుగుతున్నారని, ఇటువంటి వాతావరణం ఉందని, తప్పు చేస్తే సవరించుకోవడానికి బదులు దొంగే దొంగ అంటూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. వైయస్ భారతి పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయని, అక్రమాస్తులు సంపాదించి,త దోపిడీ చేసి, ఆరోపణలు ఎదుర్కుంటూ, జైల్లో ఉన్నా మావారు ఉత్తముడంటూ వీధుల్లో తిరుగుతున్నారని ఆయన అన్నారు.
తమ పార్టీకి ఓ విధనం, కార్యాచరణ, సిద్ధాంతం ఉన్నాయని, మీడియా చెప్పినట్లు తాము పనిచేయబోమని ఆయన అన్నారు. డైడ్లైన్లు పెట్టామని కెసిఆర్ చెప్పారా, ఎంపిలు చెప్పారా అని ఆయన అడిగారు. అయినా, ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత తాను మాట్లాడుతానని ఆయన అన్నారు.
వైయస్ జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులను ప్రస్తావించేటప్పుడు కళంకిత అనే పదం వాడవద్దని ఆయన మీడియాకు సూచించారు. మీడియా న్యాయస్థానం గానీ దర్యాప్తు సంస్థ గానీ కాదని, ఆరోపణలు ఎదుర్కుంటున్నారని మాత్రమే చెప్పాలని ఆయన అన్నారు. కళంకిత అనే పదం వాడి వారి వ్యక్తిత్వాలను కించపరచవద్దని ఆయన సూచించారు.
జగన్ ఆస్తుల మీద న్యాయస్థానం ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆయన అన్నారు. మంత్రుల మీద, ప్రభుత్వం మీద బురదచల్లాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీవారు కోర్టుకు వెళ్తే జీవోలపై సుప్రీంకోర్టు ఆదేశాలు చేసిందని ఆయన చెప్పారు. 2004 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలకు, కార్యక్రమాలకు మంత్రులు సమిష్టి బాధ్యత వహిస్తారని, అయితే మంత్రివర్గంతో సంబంధం లేకుండా తెర వెనక బాగోతాలతో మంత్రులకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఒక వేళ తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు తరతమ భేదం లేదని స్పష్టం చేశారు.
ఆరోపణలు రావడంతో కేంద్రంలో మంత్రులు రాజీనామా చేశారని, ఇక్కడ మంత్రులు రాజీనామా చేశారని, వారిని మంత్రివర్గం నుంచి తొలగించలేదని, రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని బొత్స అన్నారు. కోట్లాది రూపాయలు దోచి నిజాయితీపరులుగా తిరుగతున్నవారున్నారని, తాము తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మాదిరిగా కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications