జగన్ కేసు: చంద్రబాబుపై విరుచుకుపడ్డ కన్నా
వివాదం అంతా 26 జీవోల చుట్టే తిరుగుతోందని, ఆ అవసరం ఏమిటో చంద్రబాబు చెప్పాలని ఆయన అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనపై బురద చల్లి తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఓ జీవోతోనూ తనకు సంబంధం లేదని, నెంబర్ 12 జీవోతో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై అసత్య ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు.
తనపై బురద చల్లుతున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కళంకిత మంత్రులంటూ తన పేరు కూడా ఎందుకు చేరుస్తున్నారని ఆయన చంద్రబాబును అడిగారు. రాంకీపై సిబిఐ దర్యాప్తు పూర్తి చేసిందని, తన పేరు అందులో రాలేదని ఆయన చెప్పారు. చంద్రబాబు ముద్దాయిగా ఉండి, స్టే తెచ్చుకున్నారని, అటువంటి చంద్రబాబుకు తనపై మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మంత్రిగా తన బాధ్యత నిర్వహించానని, ఆ విషయాన్ని కోర్టు తేలుస్తుందని, ఆ వ్యవహారంలో తన విషయాన్ని తమ పార్టీ అధిష్టానం పెద్దలు, ముఖ్యమంత్రి చూసుకుంటారని ఆయన చెప్పారు. రాజీనామా చేయాలని చంద్రబాబు అన్నారు కాబట్టి తానొక్కడి తరఫుననే ఇదంతా మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు.
వైయస్ జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు కళంకితులు కారని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి తిరుపతిలో అన్నారు. వైయస్ జగన్ ధనదాహానికి మంత్రులు, ఐఎఎస్ అధికారులు బలయ్యారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరూ లేరని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిబిఐని కూడా బ్లాక్ మెయిల్ చేస్తోందని విమర్శించారు.