బాబుకు బుద్ధి రాలేదు: విజయమ్మ, వెంట సురేఖ
చంద్రబాబుకు విశ్వసనీయత, చిత్తశుద్ధి లేదని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికలకు ముందు మరో మాట మాట్లాడుతారని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన చంద్రబాబు ఆ తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడారని ఆమె అన్నారు. వైయస్ జగన్ కాంగ్రెసు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆ పార్టీతో చంద్రబాబు మిలాఖత్ అయ్యారని ఆమె అన్నారు. అందుకే శాసనసభలో అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు ఇవ్వలేదని ఆమె అన్నారు.
రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారని, అధికారంలో ఉన్నప్పుడు రైతుల వడ్డీ మాఫీ చేయాలనే ఆలోచన కూడా చేయలేదని ఆమె అన్నారు. ప్రజల గురించి ఆలోచించలేదు గానీ తన కుమారుడిని మాత్రం సత్యం రామలింగరాజు డబ్బులతో చదివించుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రెండు ఎకరాల చంద్రబాబు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని అడిగారు.
తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయాలని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని ఆమె చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైయస్ బతికి ఉంటే ప్రాణహిత - చేవెళ్ల పూర్తయి ఉండేదని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఆమె వివరించారు. వైయస్ ప్రభుత్వంలో ఏ చార్జీలు కూడా పెరగలేదని చెప్పారు. వైయస్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం పథకాలకు తూట్లు పొడుస్తోందని విజయమ్మ విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తాడని ఆమె హామీ ఇచ్చారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చెందిన 15 మంది శాసనసభ్యులు తమకు మద్దతుగా ఆ రోజు అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచారని, వారిపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వస్తే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు. ఈ రోజు మంత్రులు ఒక్కొక్కరు ఒకో రకంగా మాట్లాడుతున్నారని, జీవోలు సక్రమమా కాదా అని ఆ రోజు కోర్టు అడిగినప్పుడు చెప్పి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని ఆమె అన్నారు. జగన్పై రకరకాలుగా మాట్లాడుతున్నారని, దేవుడు చూస్తున్నాడని, ధర్మమూ న్యాయమూ తమ పక్షాన ఉందని, త్వరలో జగన్ బయటకు వస్తాడని విజయమ్మ అన్నారు.