సాక్షి పనికిమాలిన పేపరని బాబు: నీతులని విజయమ్మ
ఆర్థిక, రాజకీయ సంస్కరణలపై మహానాడులో చర్చిస్తామన్నారు. కార్పోరేట్ గుప్పిట్లో ఉండేందుకు తనకు రాజకీయాలు తెలియవా అని ప్రశ్నించారు. కొందరు కార్పోరేట్ నేతలు ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. అన్ని పార్టీలలోను కార్పోరేటర్లు ఉన్నారని చెప్పారు. పార్టీలో వారు వీరు అందరూ ఉంటారని చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఆయన వైయస్ జగన్ పైన మండిపడ్డారు.
సాక్షి పత్రికి అవినీతి, పనికిమాలిన పత్రిక అన్నారు. రోజు తనపై అరడజను తప్పుడు వార్తలు ప్రచురిస్తోందన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అసమర్థుడు, చేతకానివాడు కాదా అన్నారు. తాను తప్పు చేసి ఉంటే ఐదేళ్లు ఆయన ఏం చేశారన్నారు. తనపై వచ్చి ఆరోపణలకు అన్నింటికి వివరణ ఇచ్చానని చెప్పారు. కేసుల మాఫీ కోసం, బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తోంది జగనే అన్నారు. మంత్రుల రాజీనామాను రాజకీయం చేస్తున్నారన్నారు.
జగన్ అవినీతిపై కాంగ్రెసు నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. వైయస్ హయాంలోనే అవినీతి బాగా జరిగిందన్నారు. కాంగ్రెసు పార్టీతో కలవాల్సిన ఖర్మ తమకు లేదన్నారు. అవినీతికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం బాధ్యత వహించాలన్నారు. మంత్రులను అవినీతిలోకి లాగితే బయట పడవచ్చునని జగన్ భావిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఎవరింటిలో డబ్బు దొరికితే వారింటిని వేలం వేయాలన్నారు.
నీతులు చెబుతున్నాడు: విజయమ్మ
చంద్రబాబు తన హయాంలో అవినీతికి పాల్పడి ఇప్పుడు నీతులు చెబుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కడప జిల్లాలో అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అవిశ్వాసం నుండి చంద్రబాబు కాపాడారన్నారు. హైదరాబాదులో స్టేడియాలని ఎవరైనా నలభై ఏళ్లకు లీజుకిస్తారా అని ప్రశ్నించారు.
మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని విప్ జారీ చేసి రక్షించాడన్నారు. అవినీతి చేసి అవినీతి మంత్రుల గురించి మాట్లాడుతున్నాడన్నారు. పార్టీలో విభేదాలు నిజమేనని విజయమ్మ అంగీకరించారు. అయితే అవి త్వరలో సమసిపోతాయని ఆమె చెప్పారు. కళంకిత మంత్రులు అంటే వారు బాధపడిపోతున్నారని మరి జగన్ను ఎన్ని వేలసార్లు అన్నారని ఆమె ప్రశ్నించారు.