మంత్రులు: జగన్పార్టీ మాట మారిందా, 'క్లీన్' ఇమేజేది?
జగన్ తప్పు చేసింది నిజమే అయితే మంత్రులను ఎందుకు వదిలి పెట్టారని, జివోలు జారీ చేసిన వారిని వదిలేసి తమ పార్టీ అధ్యక్షుడిని మాత్రమే అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని, మంత్రులను వదిలి వేయడం ద్వారానే జగన్ ఎలాంటి తప్పు చేయలేదని తెలుస్తోందని ఆ పార్టీ నేతలు మొదటి నుండి చెబుతున్నారు. జగన్ను మాత్రమే అరెస్టు చేసి మంత్రులపై చర్యలు తీసుకోకపోవడంపై షర్మిల, విజయమ్మ సహా ఆ పార్టీ నేతలు పలుమార్లు ప్రశ్నించారు.
ఇప్పుడు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలు రాజీనామాలు చేశామని ప్రకటించాక మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట మారిందంటున్నారు. బుధవారం జరిగిన కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు మాట్లాడుతూ... మంత్రులు రాజీనామా చేయక ముందు జగన్ పార్టీ మంత్రుల మాటేమిటని ప్రశ్నించి, వారు రాజీనామాలు చేసినట్లు ప్రకటించాక జగన్పై కక్ష సాధింపు కోసం మంత్రులను బలి చేస్తున్నారనే కొత్త వాదన తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు.
మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి మాటలు చూసినా అలాగే ఉన్నాయంటున్నారు. జివోలు స్పష్టంగానే ఉన్నాయని చెప్పాక మంత్రులు రాజీనామా ఎందుకు చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. మంత్రులను బలి చేస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు. జగన్ను బలి చేస్తూ మంత్రుల మాటేమిటని ప్రశ్నించిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు జగన్ పైన కక్ష సాధింపు కోసమే మంత్రలను బలి చేస్తున్నారని కొత్తగా మాట్లాడుతోందని అంటున్నారు.
మరోవైపు తమ పార్టీ అధ్యక్షుడు తప్పు చేయలేదని ఆ పార్టీ నేతలు ఎప్పుడైనా చెప్పారా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించారు. జగన్ తప్పు చేయలేదని ధైర్యంగా చెప్పలేరని అన్నారు. తాము పరిశుద్ధులమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పుకోలేక ఇతరులపై విమర్శలు గుప్పిస్తోందని పలువురు నేతలు అంటున్నారు.