పోతే పోనీయండి: జగన్పై కిరణ్ ఫైర్, సిఎంగా బొత్స...
ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు కాంగ్రెసు పార్టీవే తప్ప కిరణ్ కుమార్ రెడ్డివో మరొకరివో కాదన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో తాను ఉన్నా, బొత్స సత్యనారాయణ ఉన్నా కొనసాగుతాయన్నారు. అవి కాంగ్రెసు పార్టీ పథకాలు కాబట్టి వ్యక్తిగతంగా ఎవరివి కావన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎంత దూరం నడిచినా ఒరిగేదేమీ లేదన్నారు. ఆయన ఎంత నడిచారో అంతకంటే ఎక్కువే ఆ పార్టీ నష్టపోతుందన్నారు.
తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన జగన్ ప్రస్తుతం జైలులో ఉన్నారని, ఆయన సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందని, అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మన పరిస్థితి, మన రాష్ట్రం పరిస్థితి ఏమిటో అందరూ ఆలోచించాలన్నారు. కాంగ్రెసు పార్టీ రెండు రూపాయల బియ్యాన్ని రూపాయికి, పావలా వడ్డీని సున్నా వడ్డీకి చేసిందని, జగన్ పార్టీ జెండాలోని ఆ పథకాలను మార్చుతారా చెప్పాలని ప్రశ్నించారు. మన పథకాలు వారి జెండాలో పెట్టుకోవడం విడ్డూరమన్నారు.
కాంగ్రెసు పార్టీ తమను గుర్తించి టిక్కెట్ ఇచ్చిందని, కార్యకర్తల సహకారంతో తాము గెలిచామన్నారు. కార్యకర్తలు లేనిదే ఎవరు ఎమ్మేల్యే కారన్నారు. కార్యకర్తలు గెలిపించినందువల్లే తాము ఈ వేదికపై కూర్చున్నామన్నారు. కాంగ్రెసులో కష్టపడి పని చేస్తే ఆలస్యంగానైనా తలుపు తట్టి పదవులు వస్తాయన్నారు. ఎంతో కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. లేదంటే ఓటమి తప్పదన్నారు. నాయకులు అందర్నీ కలుపుకుపోవాలన్నారు.
ఎన్నికలకు భయపడి స్థానిక సంస్థల ఎన్నికలను ఆపలేదన్నారు. బిసిలకు అన్యాయం జరుగుతోందని సుప్రీం కోర్టుకు వెళ్లి ఆ తీర్పు కోసం ఆగామన్నారు. జూన్, ఆగస్టుల్లో నిర్వహించి తీరుతామన్నారు. గత స్థానికంలో కాంగ్రెసు విజయ దుందుబి మోగించిందన్నారు. చాలా స్థానాల్లో పోటీ పోటీ ఉన్నప్పటికీ పార్టీ టిక్కెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం అందరు కృషి చేయాలని కోరారు. ఎక్కడైనా విభేదాలు సహజమే అన్నారు. తల్లిదండ్రులు, అక్కా చెల్లెల్లు చివరకు లవర్స్ మధ్య కూడా విభేదాలుంటాయని, పార్టీలో కూడా సహజమే అన్నారు.
సర్వేలపై విసుర్లు
సర్వేలను నమ్మవద్దని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు వందల మందిని అడిగి ఇదే ఎపి సర్వే అని చెబుతారని కాని స్థానికంలో కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందన్నారు. పార్టీలోని విభేదాలను పక్కన పెట్టి అందరు కలుపుకొని పోయి విజయం కోసం కృషి చేయాలన్నారు. మీడియాలో కొన్ని ఊహాజనిత విభేదాలను నమ్మవద్దన్నారు.
పోయే వాళ్లను పోనీయండి
ఒక వ్యక్తి వల్లనో, ఒక నాయకుడి వల్లనో కాంగ్రెసు పార్టీ లేదన్నారు. నాయకులు పోతే వచ్చే నష్టమేమీ లేదన్నారు. పోయే వాళ్లను పోనీయండని, కార్యకర్తలు నాయకులుగా అవుతారన్నారు. పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుందన్నారు. పదివేల ఓట్లు పోతే ఇరవై వేల ఓట్లు సమీకరించేందుకు ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నారు. కాంగ్రెసులో అందరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలన్నారు. త్వరలో పన్నెండు లక్షల రేషన్ కార్డులిస్తామన్నారు.