కాంగ్రెసు సమావేశం: సాక్షి మీడియా, జగన్ టార్గెట్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాను తప్పు పట్టారు. జెండాపై తొమ్మిది అంశాలున్నాయని, అవన్నీ వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెసు పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన గుర్తులని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా మీద ఉన్న పతకాలన్నీ కాంగ్రెసు పార్టీకి చెందినవని, ఏమైనా అంటే తన తండ్రి పెట్టిన పథకాలని జగన్ చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలేవీ ఆయన సొంతం కావని, అవి కాంగ్రెసు పార్టీ పథకాలని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఇతర పత్రికలు కట్టుకథలు, అవాస్తవాలు రాస్తున్నాయని, వాటి మాదిరిగా కాకుండా ఉన్నదున్నట్లుగా రాస్తామని, కాంగ్రెసును ఉద్ధరిస్తామని చెప్పి సాక్షి పత్రికను ప్రారంభించారని, అయితే కాంగ్రెసును ఉద్ధరించడానికి బదులు అందుకు విరుద్ధంగా సాక్షి రాస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర నాయకులు కూడా జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జగన్పై విరుచుకుపడ్డారు. జగన్ది ఆర్థిక ఉగ్రవాదమని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నవారి గురించి ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెసు సోనియా కుటుంబాన్ని ఆయన కుటుంబం తిడుతోందని ఆయన అన్నారు. కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావుతో పాటు మరింత మంది నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications